బెంగళూరులో వెలుగులోకి వచ్చిన ఓ చిన్నారి మృతి కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తొలుత అనుమానాస్పద మరణంగా నమోదైన ఈ ఘటన, తాజాగా పోలీసు దర్యాప్తులో ఊహించని మలుపు తిరిగింది. 3 నెలల క్రితం మరణించిన 6 ఏళ్ల చిన్నారి వెన్నెల కేసులో ఇప్పుడు హత్య కోణం వెలుగులోకి రావడంతో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. చిన్నారి తల్లి, వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న ప్రియాంకతో పాటు ఆమె ప్రియుడు, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త జి.ఎమ్.మోహన్పై హత్య కేసులు నమోదు చేశారు. ఇప్పటికే మోహన్ను అరెస్ట్ చేసి 7 రోజుల పోలీసు కస్టడీలోకి తీసుకోగా, ప్రియాంక పరారీలో ఉండటంతో ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
దావణగెరెకు చెందిన ప్రవీణ్ బసప్ప, ప్రియాంక దంపతులు 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దాదాపు 17 సంవత్సరాల పాటు సజావుగా సాగిన వారి దాంపత్య జీవితం 2025 నవంబర్లో కొత్త మలుపు తిరిగినట్లు దర్యాప్తులో తేలింది. బెంగళూరులోని 25 ఎకరాల పిత్రార్జిత భూమికి సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాల కోసం నగరానికి వచ్చిన ప్రియాంక, తన కాలేజీ రోజుల నాటి మాజీ ప్రేమికుడు జి.ఎమ్.మోహన్తో మళ్లీ సన్నిహితంగా మారింది. ప్రస్తుతం తన వద్ద రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని చెప్పుకునే మోహన్తో ఆమె సంబంధం మరింత బలపడినట్లు తెలుస్తోంది. అనంతరం భర్తకు తెలియకుండా డిసెంబర్ చివరి వారంలో కాశీకి వెళ్లి రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత నూతన సంవత్సర వేడుకల కోసం ఇద్దరూ దుబాయ్కు వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
జనవరిలో తిరిగి వచ్చిన ప్రియాంక తన భర్త ప్రవీణ్పై ఒత్తిడి తెచ్చి విడాకుల పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. అనంతరం పెద్ద కుమార్తె తండ్రి వద్దనే ఉండగా, చిన్నారి వెన్నెలను వెంట తీసుకుని బెంగళూరులోని సీగేహళ్లి ప్రాంతంలోని విల్లాలో జి.ఎమ్.మోహన్తో కలిసి నివసించడం ప్రారంభించింది. మార్చి 24న ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా జరిగిన పరిణామాలే ఇప్పుడు ఈ కేసులో ప్రధాన అంశంగా మారాయి. ఆ రోజు రాత్రి వెన్నెలకు బిర్యానీ, ఐస్క్రీమ్ తినిపించిన తర్వాత తాను, మోహన్ కలిసి వేడుకల కోసం బయటకు వెళ్లామని, గాఢ నిద్రలో ఉన్న చిన్నారిని కారులో ఏసీ ఆన్ చేసి వదిలేసినట్లు ప్రియాంక పోలీసులకు తెలిపింది. అనంతరం అర్ధరాత్రి తిరిగి వచ్చి పాపను ఇంట్లోకి తీసుకెళ్లినట్లు చెప్పింది. అయితే మరుసటి రోజు ఉదయం చిన్నారి స్పందించకపోవడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై మొదటి నుంచే అనుమానం వ్యక్తం చేసిన తండ్రి ప్రవీణ్ బసప్ప, ఏప్రిల్ 4న పోస్టుమార్టం నివేదికను సేకరించి ఇంగ్లాండ్లో బాలల వైద్య నిపుణురాలిగా పనిచేస్తున్న తన సోదరి డాక్టర్ పూర్ణిమకు పంపించాడు. నివేదికను పరిశీలించిన ఆమె, చిన్నారి మరణం సహజంగా జరిగి ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడినట్లు సమాచారం. తమ కొత్త జీవితానికి అడ్డంకిగా మారిందనే ఉద్దేశంతో చిన్నారిని ఉద్దేశపూర్వకంగా హత్య చేసి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రవీణ్ జూన్ 4న కడుగోడి పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు కొత్త దిశగా సాగింది.
దర్యాప్తు సందర్భంగా సేకరించిన వైద్య ఆధారాలు, ప్రయోగశాల నివేదికలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా పోలీసులు ఈ కేసును హత్య కేసుగా నమోదు చేశారు. ప్రారంభ దశలో ఊపిరాడక మరణించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, పూర్తి స్థాయి వైద్య నివేదికలు అందిన తర్వాత పరిస్థితి మారినట్లు అధికారులు చెబుతున్నారు. రక్త నమూనాల్లో విష పదార్థాల ఆనవాళ్లు లభించకపోవడంతో ఇతర నమూనాలను న్యాయ వైజ్ఞానిక ప్రయోగశాలకు పంపించారు. లభించిన ఆధారాల ఆధారంగా కోర్టును ఆశ్రయించిన పోలీసులు, జి.ఎమ్.మోహన్కు లభించిన ముందస్తు బెయిల్ను రద్దు చేయించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. చిన్నారి వెన్నెల మృతి వెనుక అసలు కారణాలు ఏమిటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ALSO READ: భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక