సోషల్ మీడియాలో నటి జాన్వీ కపూర్ చేసిన చిన్న పని ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పెద్ది’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’ అనే పాత్రలో కనిపించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నెగెటివ్ పోస్టుకు జాన్వీ లైక్
ఈ సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఓ పేజ్ ఈ చిత్రంపై ఓ రివ్యూ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో “భారతీయ సినిమా చరిత్రలో ఒక కథానాయికకు జరిగిన అత్యంత అవమానం ‘పెద్ది’ సినిమా” అని హెడ్ లైన్ పెట్టి, జాన్వీ పాత్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అభిప్రాయపడింది. ఈ పోస్టు నెట్టింట్లో వేగంగా వైరల్ అయ్యింది. అయితే ఈ పోస్టును జాన్వీ కపూర్ లైక్ చేయడంతో ఒక్కసారిగా కొత్త చర్చ మొదలైంది. ఆమె లైక్ చేయడం వల్ల, సినిమాలో తన పాత్రకు సరైన ప్రాధాన్యం దక్కలేదని ఆమె కూడా అంగీకరించినట్టేనా అనే కామెంట్లు సోషల్ మీడియాలో కనిపించాయి. కొంతమంది ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన లైక్ అని భావించగా, మరికొందరు పొరపాటున నొక్కి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
అన్ లైక్ చేసినా ఆగని రచ్చ
ఈ విషయం పెద్ద ఎత్తున వైరల్ కావడంతో, ఆ పోస్ట్ను జాన్వీ కపూర్ తర్వాత అన్లైక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే ఆ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. దీంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ సినిమాను రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలైన మొదటి రోజు నుంచే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని మేకర్స్ తెలిపారు. ప్రీమియర్ షోలతో కలిపి మొదటి రోజు సుమారు రూ.135 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం పోస్టర్ ద్వారా ప్రకటించింది.