HomeజాతీయంFalta Repoll: ఫాల్తా రీపోలింగ్‌.. లక్షకుపైగా మెజారిటీతో బీజేపీ జయకేతనం!

Falta Repoll: ఫాల్తా రీపోలింగ్‌.. లక్షకుపైగా మెజారిటీతో బీజేపీ జయకేతనం!

పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గ రీపోలింగ్‌లో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా లక్షకుపైగా మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అక్రమాలు, అవకతవకల నేపథ్యంలో రీపోలింగ్

ఫాల్తా నియోజకవర్గంలో ఏప్రిల్‌ 29న మొదటి పోలింగ్‌ జరిగింది. అయితే ఆ ఎన్నికల సందర్భంగా అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు పలు ఫిర్యాదులు రావడంతో భారత ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంది. పరిస్థితిని పరిశీలించిన ఎన్నికల సంఘం ఆ జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి, మళ్లీ ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఈ నెల 21న రీపోలింగ్‌ జరిగింది.

తాజా ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పండాకు మొత్తం 1,49,666 ఓట్లు లభించాయి. ఆయనకు ప్రత్యర్థిగా నిలిచిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,645 ఓట్లు మాత్రమే సాధించారు. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 1.09 లక్షలకు పైగా ఉండటం విశేషం.

చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్

ఇక అధికార పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఆయనకు 7,783 ఓట్లు నమోదయ్యాయి. రీపోలింగ్ తర్వాత వచ్చిన ఈ భారీ మెజారిటీ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచింది. మరోవైపు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఇది రాజకీయంగా ఎదురుదెబ్బగామారింది. ఫాల్తాతో పశ్చిమ బెంగాల్‌లో రాబోయే ఎన్నికలపై కూడా రాజకీయ చర్చలు మొదలయ్యాయి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు