కామారెడ్డి, క్రైమ్ మిర్రర్: మహిళలపై వేధింపులు, అత్యాచారాలు ఎన్ని చట్టాలు వచ్చిన కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ కాంగ్రెస్ నాయకుడు నా కోరిక తీరిస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని మహిళపై వేధింపులకు పాల్పడన ఘటన ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. అతని వేధింపులతో విసిగిపోయిన మహిళ ఇటీవల పోలీసులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి కథనం ప్రకారం… కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన మహిళ ఇల్లు కూలిపోవడంతో రెండేళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటుంది. దీంతో ఇందిరమ్మ ఇల్లు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే ఓ కాంగ్రెస్ నాయకుడిని ఆశ్రయించగా.. తన కోరిక తీర్చాలని.. అప్పుడే ఇల్లు మంజూరు చేయిస్తానని చెప్పాడు. అందుకు సదరు మహిళ నిరాకరించింది. దీంతో కక్ష గట్టిన కాంగ్రెస్ నాయకుడు.. డబుల్ బెడ్రూం ఇళ్ల జాబితాలో తన పేరు వచ్చినా తొలగించాడని బాధిత మహిళ సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణమని పేర్కొంది.
కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించడంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. మహిళను వేధించిన రాజంపేట కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడిని సస్పెండ్ చేసిందని సమాచారం.