తిరుపతి, క్రైమ్ మిర్రర్: 89.40 శాతం పచ్చదనంతో తిరుమల గిరులు కళకళలాడుతున్నాయి. అరణ్య సంపద పరిరక్షణలో టీటీడీ అటవీ శాఖ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. స్థానిక వృక్ష సంపద పునరుద్ధరణకు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. 576 హెక్టార్లలో స్వదేశీ మొక్కల పెంపకం చేపట్టారు. ప్రత్యేక నర్సరీల ద్వారా నాణ్యమైన మొక్కల సరఫరా చేస్తున్నారు. ఏనుగులు, చిరుతలు సహా వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకున్నారు. ఆలయ పూజ కైంకర్యాలలో అటవీ శాఖ పాత్ర కీలకంగా మారిందితిరుమల గిరులు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.. ఏకంగా 89.40 శాతం పచ్చదనం కనిపిస్తోంది. 1980 నుంచి టీటీడీ అటవీ శాఖ శేషాచల అరణ్య సంపదను పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుతోంది. కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తోంది.
తూర్పు కనుమల్లో విస్తరించిన పవిత్ర శేషాచల పర్వత శ్రేణుల్లోని అరణ్య ప్రాంతాలను సంరక్షిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణలో కీలకంగా మారింది. టీటీడీ అటవీ విభాగ పరిధిలో మొత్తం 2719 హెక్టార్ల విస్తీర్ణంలో అరణ్య ప్రాంతం ఉంటే.. తాజా ISFR (ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక) ప్రకారం 89.40 శాతం మేర అటవీ ప్రాంతం నమోదైంది. దేశంలోనే అత్యుత్తమైన స్థానంలో నిలిచింది. దాదాపు 2431 హెక్టార్లలో అటవీ ప్రాంతాలు ఉండగా.. వాతావరణ నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణకు దోహదపడుతున్నాయి.డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆధ్వర్యంలో టీటీడీ అటవీ విభాగం కొనసాగుతోంది. మొత్తం నాలుగు ఫారెస్ట్ రేంజ్లు తిరుమలలో రెండు,
తిరుపతిలో రెండు చొప్పున ఉన్నాయి. ఇలా ప్రతి రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఉంటుంది. అటవీ పరిరక్షణను ఫీల్డ్ స్థాయిలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, సిబ్బంది సమన్వయంతో చేపడుతున్నారు. 24 గంటల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పహారా ఉంటూ అటవీ సంపద సంరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు అక్రమ చెట్ల నరికివేత, వేట చర్యలను అరికడుతున్నారు. అటవీ అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక ఫైర్ లైన్లతో పాటుగా శిక్షణ పొందిన బృందాలు అగ్నిమాపక చర్యలు చేపడుతున్నాయి. ప్రతి ఏంటా 26.5 లక్షల చదరపు మీటర్ల మేర ఫైర్ లైన్లు నిర్వహిస్తున్నారు.
టీటీడీ జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా విదేశీ జాతికి చెందిన అకేషియా చెట్ల స్థానంలో స్థానిక వృక్ష సంపదను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం 576 హెక్టార్లలో స్థానిక జాతులైన గంధం, ఎర్రచందనం, ఉసిరి, నేరేడు, రావి, మర్రి, జువ్వి, మేడి, సంపంగి, మామిడి వంటి మొక్కలను దశలవారీగా నాటుతున్నారు. ఇప్పటివరకు 22 హెక్టార్లలో పనులు పూర్తయ్యాయి. అంతేకాదు టీటీడీ పరిధిలోని నాలుగు ఫారెస్ట్ రేంజ్లలో ప్రత్యేక నర్సరీలను నిర్వహిస్తున్నారు. అక్కడ స్థానిక జాతుల మొక్కలు, అలంకార మొక్కలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ఈ నర్సరీల ద్వారా అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలకు అవసరమైన నాణ్యమైన మొక్కలను సరఫరా చేస్తున్నారు.శేషాచల అటవీ ప్రాంతంలో ఎన్నో వన్యప్రాణులు నివసిస్తున్నాయి.
మానవ – వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు, గాయపడిన జంతువులను రక్షించేందుకు టీటీడీ అటవీ విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకుని అటవీ ప్రాంతాల్లో జంతువుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక నీటి గుంతలు ఏర్పాటు చేసి వాటిలో నీటిని నింపుతున్నారు. తిరుమలలో దర్శన క్యూ లైన్ ప్రాంగణాల్లో మూడు స్నేక్ రెస్క్యూ బృందాలను నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకరమైన చెట్లను గుర్తించి తొలగించడం, గాలివానల కారణంగా పడిపోయిన చెట్లను తొలగించడం, రహదారుల పక్కన చెట్ల కొమ్మలను క్రమం తప్పకుండా తొలగిస్తున్నారరు.
తిరుమల, టీటీడీ ఆలయ అవసరాల కోసం అవసరమైన శ్రీగంధం చెక్కలు, వంట చెరుకు, దర్భ గడ్డి, ఇతర పూజా సామగ్రిని టీటీడీ ఫారెస్ట్ విభాగం సమకూరుస్తోంది. తిరుమల, తిరుపతిలోని రహదారి డివైడర్లు, ఉద్యానవనాలు, పచ్చదన అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. మొత్తం 24 కిలోమీటర్ల మేర రహదారి డివైడర్లు, 25 ఉద్యానవనాలను సంరక్షిస్తోంది. వీటితో పాటుగా అరుదైన, ఔషధ గుణాలు ఉన్న వృక్ష జాతుల పరిరక్షణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ఆయుర్వేద ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను కూడా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పవిత్ర వనం, దివ్య ఔషధ వనం, పలమనేరు టింబర్ ప్లాంటేషన్, వన్యప్రాణి ఘర్షణల నివారణకు వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యం.. కొండల పచ్చదనం పెంపు వంటి పలు కీలక ప్రాజెక్టులను టీటీడీ ఫారెస్ట్ విభాగం అమలు చేస్తోంది.