క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి (అలియాస్ సంతోష్) తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడం, దేశంలో మావోయిస్టు ఉద్యమానికి మరియు ఆ పార్టీ కేంద్ర కమిటీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి.
పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామం. ఆయన పసునూరి సోమనారాయణ, నర్సమ్మ దంపతుల రెండో కుమారుడు. 1980వ సంవత్సరంలో ఎల్బీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో నక్సల్స్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతి రణదేవ్ (బక్కన్న) లతో ఏర్పడిన పరిచయంతో ఉద్యమం వైపు అడుగులు వేశారు.
ప్రారంభంలో భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి, అనంతరం 1996 నుండి పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారు. దాదాపు 45 ఏళ్ల అజ్ఞాత జీవితంలో పార్టీలో అంచలంచెలుగా ఎదిగి అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. మావోయిస్టు పార్టీకి అవసరమైన వ్యూహాల రచన, పేలుడు పదార్థాల తయారీ వంటి సాంకేతిక అంశాలపై పట్టు ఉండటంతో జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగానికి ఇన్ఛార్జ్గా కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఆయన భార్య కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ కాగా, ఆమె కూడా పార్టీలోనే కీలక బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం జార్ఖండ్లోని ప్రసిద్ధ సరండా అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా, గణపతి వంటి అగ్రనేతలను పట్టుకోవడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్స్ (ఆపరేషన్ కగార్) నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలో సాయుధ బలగాల ఒత్తిడి పెరగడం, మరోవైపు వయస్సు పైబడటం, అనారోగ్య సమస్యల కారణంగా నరహరి దంపతులు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. ఆయనపై దాదాపు రూ.20 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. దశాబ్దాల పాటు గెరిల్లా పోరాటంలో కీలక పాత్ర పోషించిన నరహరి లొంగిపోవడం ఆ పార్టీ కేడర్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.