-
ఆందోళనలో ప్రజలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్ర రూపం దాల్చుతోంది. ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వసాధారణం అయింది. ఇక భాగ్యనగరం హైదరాబాదులో పరిస్థితి చెప్పనవసరం లేదు. ఎండలు తీవ్రమవుతుండడంతో నగరంలో భూగర్భ జలాలు మరింత అడుగంటుతున్నాయి. నీటి ఎద్దడి పెరిగే అవకాశం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రమాదకర స్థాయికి భూగర్భ జలాలు పడిపోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఒక్క నెలలోనే నీటిమట్టం తగ్గడం గ్రేటర్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వేసవి ప్రమాద తీవ్రత తప్పదని భాగ్యనగరం ప్రజలు ఆందోళనతో ఉన్నారు.
80 శాతం ప్రాంతాల్లో లోటు…
హైదరాబాద్లోని సుమారు 80% ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. పది మీటర్ల కంటే తక్కువ లోతుకు పడిపోయాయి అని గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల సాధారణ బోర్ల నుంచి నీరు రావడం కష్టతరంగా మారుతుంది. ప్రధానంగా కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో 35 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆ ప్రాంతంలో ఇప్పటికే నీటి ఎద్దడి ప్రారంభం అయింది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో.. భూగర్భంలో నీటి ఒత్తిడి పెరిగి.. ఉన్న వనరులు కూడా త్వరగా హరించుకుపోతున్నాయి. దీంతో టాంకర్ల ద్వారా నీటి సరఫరా పై భాగ్యనగరం ప్రజలు ఆధార పడాల్సి వస్తోంది.
నీటి లభ్యత లేదు …
నగరంలో పెరుగుతున్న ప్రజల అవసరాలకు తగ్గట్టు నీటిలభ్యత లేదు. విచ్చలవిడి నీటి వినియోగంతో భూగర్భ జలాల్లో నీరు అడుగంటి పోతోంది. కానీ ప్రభుత్వం మాత్రం సీరియస్ గా తీసుకోకపోవడం పై విమర్శలు పెరుగుతున్నాయి. ఒకేసారి నీటిమట్టం ఇంత వేగంగా పడిపోవడానికి కారణం ఏంటనేది తెలియడం లేదు. అయితే నగరంలో పెరుగుతున్న విచ్చలవిడి గృహ నిర్మాణం, అపార్ట్మెంట్ల నిర్మాణం, నిబంధనలకు విరుద్ధంగా వేలాది బోర్లు వేయడం వంటి కారణాలతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.
భారీ వర్షాలు కురిసే సమయంలో నీటిని భూమిలోకి ఇంకించే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గుంతలు చాలా చోట్ల పనిచేయడం లేదు. నీటిని నిల్వ చేసే చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయి. తద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణకు అవకాశం లేకుండా పోతోంది. ప్రస్తుత హైదరాబాదులో పరిస్థితి చూస్తుంటే మున్ముందు నీరు ఆవిరి అయిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే భాగ్యనగరం ప్రజలు నీటి కోసం అల్లాడడం ఖాయం. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.