జైపూర్, క్రైమ్మిర్రర్: పాకిస్థాన్లోని ఏ ఉగ్రవాద స్థావరం సురక్షితం కాదని ‘ఆపరేషన్ సిందూర్’ నిరూపించిందని, ఇది ముగింపు కాదని కేవలం ఆరంభం మాత్రమేనని భారత సైన్యం వెల్లడించింది. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్ను శిక్షించడానికి, గత అర్ధ శతాబ్దంలో భారతదేశం చేపట్టిన అత్యంత విస్తృతమైన పోరాట మిషన్గా అభివర్ణించింది. ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఏడాది పూర్తైన నేపథ్యంలో అందుకు సంబంధించిన వివిధ అంశాలను వివరిస్తూ త్రివిధ దళాల అధిపతులు జైపుర్ లో సంయుక్త పత్రికా సమావేశం నిర్వహించారు.
ఆపరేషన్ సిందూర్ ముగింపు కాదు ప్రారంభమని వెల్లడి ఆపరేషన్ సిందూర్ ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యూహాలకు కొత్త పాఠంగా నిలిచిందని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్కు నేటితో ఏడాది పూర్తి అయిన వేళ మాట్లాడిన జనరల్ రాజీవ్, సమాచార, నిఘా, BSF, సైన్యం వంటి అన్ని విభాగాల మధ్య అద్భుతమైన సమన్వయం విజయానికి కారమణన్నారు. ఈ ఆపరేషన్లో బ్రహ్మోస్, ఆకాశ్తో సహా మరెన్నో స్వదేశీ ఆయుధాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయన్నారు.
అత్యంత తక్కువ సమయంలో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్కు ప్రణాళిక చేసి అమలు చేశామన్నారు. ఏ ఉగ్ర స్థావరం సురక్షితం కాదని ఆపరేషన్ సిందూర్తో స్పష్టమైన సందేశం ఇచ్చామని చెప్పారు. ప్రజలు, భద్రత, సార్వభౌమత్వాన్ని భారత్ కాపాడుకోగలదని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ ముగింపు కాదని, ప్రారంభమని జనరల్ రాజీవ్ ఉద్ఘాటించారు.