BJP Set to Form Government in West Bengal: పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీని గవర్నర్ ఆర్.ఎన్. రవి అధికారికంగా రద్దు చేశారు. ముఖ్యమంత్రి పదవికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు కొనసాగుతున్న మమతా ప్రభుత్వానికి అధికారికంగా ముగింపు పలికినట్లైంది.
బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లభ్యం
294 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఇటీవల రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మే 4న వెలువడిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించి అధికారాన్ని దక్కించుకుంది. ప్రజలు బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో మద్దతు ఇవ్వడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు. అనంతరం ఆ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.
మే 9న ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మే 9న ఉదయం 10 గంటలకు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్నట్లు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యే అవకాశముంది.
కొత్త ముఖ్యమంత్రి ఎవరు?
ఇదిలా ఉండగా, కొత్త ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఘన విజయం సాధించిన సువేందు అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన్నే సీఎం పదవికి ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తూ ఈసీనే అసలు విలన్ అంటూ మండిపడ్డారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని కూడా స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ గడువు గురువారంతో ముగియడంతో రాజ్యాంగ పరమైన ప్రక్రియలో భాగంగా గవర్నర్ అసెంబ్లీని రద్దు చేసినట్లు ప్రకటించారు. దీంతో బెంగాల్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.