-
29 రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాలు కాషాయ మయం
-
దేశ జనాభాలో 78% ఎన్డీఏ వైపే
-
బిజెపి పరంగా 72 శాతం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. ఆ సేతు హిమాచలం.. అన్ని ప్రాంతాల్లో కాషాయం విస్తరించింది. చాలా రోజులపాటు కురుకుడు పడని పశ్చిమ బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగిరింది. 15 సంవత్సరాల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంగళం పాడారు బెంగాలీ ఓటర్లు. భారీ మెజారిటీతో అక్కడ బిజెపి దూసుకుపోయింది. ఈ విజయంతో దేశం ముఖచిత్రం సమూలంగా మారిపోయింది.
పశ్చిమ బెంగాల్ తో పాటు అస్సాం.. దక్షిణాదిన ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా అధికారాన్ని నిలబెట్టుకోవడంతో.. దేశం పై పూర్తి పట్టు సాధించింది భారతీయ జనతా పార్టీ. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉండగా.. 20చోట్ల కాషాయ జెండా ఎగిరింది అంటే బిజెపి ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాన 3, దక్షిణాది రాష్ట్రాల్లో నాలుగు, ఈశాన్యంలో ఒకటి, తూర్పున ఒక రాష్ట్రం మినహా.. మిగతావన్నీ బిజెపి ఖాతాలో పడ్డాయి.
ఆ తొమ్మిది రాష్ట్రాలు తప్ప..
29 రాష్ట్రాలు ఉన్న విశాల భారతదేశం మనది. అందులో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, ఝార్ఖండ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు.. మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బిజెపి జెండా పాతింది. దేశం మొత్తం భూభాగంలో 72 శాతం.. దేశ జనాభాలో 78 శాతాన్ని ఆవహించింది. అక్షరాల 100 కోట్ల మందికి పైగా ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపారు. దేశ విస్తీర్ణంలో మూడో వంతు భాగానికి పైగా బీజేపీకి హస్తగతం అయింది. ప్రముఖ మ్యాగజైన్ ఇండియా టుడే ఓ మ్యాప్ ను కూడా ప్రచురించింది.
అప్పటికి కేవలం ఎనిమిది మాత్రమే..
2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. ఆ సమయానికి దేశంలో కేవలం ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే బిజెపి అధికారంలో ఉంది. హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ జార్ఖండ్, గోవా, నాగాలాండ్లో మాత్రమే బిజెపి అధికారంలో ఉంది. ఏ క్షణంలో అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారో.. నాటి నుంచి ఒక్కో రాష్ట్రం బిజెపికి హస్తగతం అవుతూ వచ్చింది.
ఇప్పుడు ఏకంగా ఆ సంఖ్య 20 కి చేరింది. 2014లో దేశ విస్తీర్ణంలో 34% బిజెపి ఆవహించింది. అప్పట్లో దేశ జనాభాలో 25 శాతం మంది ఆ పార్టీకి పట్టం కట్టారు. 2018 నాటికి మాత్రం ఆ శాతం 75 కు చేరుకుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసే సరికి దాదాపు సంపూర్ణ మద్దతు దిశగా బిజెపి చేరుకుంది. అయితే ఎన్డీఏ పరంగా 72 కాగా.. బిజెపికి సొంతంగా 78 శాతం మంది జై కొట్టారు. ఇదేం చిన్న విషయం కాదు.