West Bengal Election 2026: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన తుది దశ పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. సుమారు 41 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసి, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం 1,448 మంది అభ్యర్థులు ఈ దశలో పోటీ పడుతున్నారు.
భవానీపూర్ లో హై టెన్షన్
ఈ విడతలో ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తుండగా, ఆమెకు ప్రత్యర్థిగా సువేందు అధికారి బరిలో నిలిచారు. గతంలో నందిగ్రామ్ లో వీరిద్దరి మధ్య జరిగిన పోరులో సువేందు విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ భవానీపూర్ వేదికగా తలపడుతుండటంతో ఈ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. సువేందు అధికారి భవానీపూర్తో పాటు నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ రెండు కీలక ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఈ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది.
భారీ బందోబస్తు ఏర్పాటు
పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలను విస్తృతంగా మోహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. తుది ఫలితాలు మే 4న ప్రకటించనున్నారు. మొత్తంగా, ఈ తుది దశ పోలింగ్ పశ్చిమ బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనుంది.