కామారెడ్డి, క్రైమ్ మిర్రర్: కామారెడ్డిలో జిల్లా పరిధిలో భార్య కొడవలితో భర్తను నరికి చంపిన ఘటన ఆప్రాంతంలో కలకలం రేపింది. చిన్న చిన్న కుటుంబ తగాదాలకే కోపోద్రిక్తురాలైన భార్య కొడవిలో దాడి చేసి చంపేయడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలైన కోదండం లక్ష్మి, శివాజీ మధ్య కొంతకాలంగా కుటుంబ సమస్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
తరచుగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి తలెత్తిన వాగ్వాదం పెద్ద గొడవగా మారి చివరకు హత్యకు దారితీసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కోదండం లక్ష్మి కోపోద్రిక్తంగా మారి, ఇంట్లో ఉన్న కొడవలితో భర్త శివాజీపై దాడి చేసింది. ముఖ్యంగా మెడపై తీవ్రంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు…
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోదండం లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హత్యకు గల అసలు కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు ప్రాథమికంగా ఇది కుటుంబ గొడవల కారణంగా జరిగిన హత్యగా భావిస్తున్నప్పటికీ.. ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.