-
బిజెపితో పొత్తు కోసం ప్రయత్నం
-
టిడిపి అధినేత పై బాధ్యతను పెట్టిన కేంద్ర పెద్దలు
క్రైమ్ మిర్రర్, జనరల్ డెస్క్: బిజెపితో పొత్తుకు కేసిఆర్ ప్రయత్నిస్తున్నారా? ఎలాగైనా బిజెపితో కలవాలని చూస్తున్నారా? లేకుంటే రేవంత్ రెడ్డి గులాబీ పార్టీని కబలించడం ఖాయమా? అందుకే ఆయన ఆందోళనతో ఉన్నారా? బిజెపి కోసం చంద్రబాబుకు రాయబారం పంపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.
ఎప్పటినుంచో విభేదాలు..
చంద్రబాబుతో కేసీఆర్ విభేదాలు ఇప్పటివి కావు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆవేశంతో, ఆవేదనతో టిడిపికి గుడ్ బై చెప్పారు కెసిఆర్. నాటి నుంచి చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. మధ్యలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పై కూడా పోరాటం చేశారు. ఆయన అకాల మరణంతో తిరిగి చంద్రబాబుపై ఫోకస్ పెట్టారు. తెలంగాణ సమాజానికి చంద్రబాబును విలన్ గా చూపించి రాజకీయ పునాది వేసుకున్నారు కేసీఆర్. అలా రెండుసార్లు తెలంగాణలో అధికారంలోకి రాగలిగారు. ఏపీలో చంద్రబాబు ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయనకు ఇబ్బంది పెట్టారు. ఇప్పటికీ చంద్రబాబు విషయంలో అదే భావనతో వ్యవహరిస్తూ వచ్చారు కేసీఆర్.
రాజకీయ ఇబ్బందుల్లో..
ప్రస్తుతం తెలంగాణలో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. రాజకీయంగా కవిత విభేదించి బయటకు వెళ్లిపోయారు. మరోవైపు హరీష్ రావు విషయంలో సైతం అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. మరో కుటుంబ సభ్యుడు సంతోష్ రావు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. కేటీఆర్ వ్యవహార శైలిలో సైతం మార్పు వస్తోంది. పైగా కుటుంబ పార్టీగా.. అవినీతి పార్టీగా గులాబీ పార్టీపై ఒక ముద్ర వేశారు. అయితే కెసిఆర్ కు జైలు అవసరం లేదు. ఇప్పటికే ఫామ్ హౌస్ రూపంలో జైలులో పెట్టాను అన్న రీతిలో రేవంత్ ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలో వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయం. అందుకే కేసిఆర్ బిజెపి కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ అటువైపు నుంచి అనుకున్నంత స్థాయిలో సానుకూలత రావడం లేదు. దీంతో కెసిఆర్ పునరాలోచనలో పడ్డారు.
పాత వైరం మరిచి..
రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు, శాశ్విత శత్రువు ఉండరంటారు. ఈ ఫార్ములాను అనుసరించి ఇప్పుడు కెసిఆర్ చంద్రబాబు సాయం కోరుతున్నట్లు తెలుస్తోంది. బిజెపి సైతం కేసీఆర్ విషయంలో చంద్రబాబు సాయం, సలహా కోరుతున్నట్లు సమాచారం. కెసిఆర్ తో పొత్తు విషయంలో బిజెపి అనుసరించాల్సిన వ్యూహం బాధ్యతను చంద్రబాబుకు అప్పగించినట్లు తెలుస్తోంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్ కు చంద్రబాబు ఏకైక దిక్కు అని స్పష్టమవుతోంది. అయితే ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టిన కేసీఆర్ విషయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.