HomeతెలంగాణTelangana Buses: రోడ్డెక్కనున్న బస్సులు.. కార్మికుల డిమాండ్లకు సర్కార్ అంగీకారం!

Telangana Buses: రోడ్డెక్కనున్న బస్సులు.. కార్మికుల డిమాండ్లకు సర్కార్ అంగీకారం!

* ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం!

* ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై హైలెవల్ కమిటీ

* కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

* తక్షణమే ఒకటి లేదా రెండు డీఏల చెల్లింపునకు ఓకే

మూడు రోజులుగా డిపోలకే పరిమితమైన తెలంగాణ ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం అయినట్లు,  సమ్మె చేపట్టిన కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా.. తక్షణమే ఒకటి లేదా రెండు డీఏల చెల్లింపునకు ఓకే చెప్పింది ప్రభుత్వం.

మరోవైపు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై హైలెవల్ కమిటీని నియమించే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు 12 గంటల పాటు కొనసాగాయి. మంత్రుల కమిటీ, జేఏసీ నేతల మధ్య 32 డిమాండ్లపై చర్చలు జరిగాయి. ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ చర్చల్లో దశాబ్దాల విలీన సమస్యకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం తెలిపారు.

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మాట్లాడుతూ. ‘బడ్జెట్ సమావేశాలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా బిల్లు, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, నేను, ఇతర మంత్రులు బిజీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా సమ్మె నిర్ణయం తీసుకోవడంతో ఒక కార్మికుడిని  కోల్పోవాల్సి వచ్చింది. ఇది అత్యంత బాధాకరం, ఆ కుటుంబానికి ఇది తీరని లోటు’ అని అన్నారు. ఆర్టీసీ అందరి సంస్థ అని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు