క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీత (33) అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఈ విషాదకర సంఘటన జరిగింది. సంగీత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మట్టెవాడలోని తన నివాసంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అంతకుముందు రోజు (ఏప్రిల్ 20) ముఖ్యమంత్రి బందోబస్తు విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. సంగీత రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. అందులో తోటి కానిస్టేబుల్ శ్రీధర్ వేధింపులే తన మరణానికి కారణమని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.