హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణ రాష్ర్టంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్రవ ఎక్కువగానే కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరిగడంతో రాత్రి పూట సైతం ఇదే పరిస్థతి కొనసాగుతుంది. ఏప్రిల్ మొదటి వారంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాల వల్ల కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఎండలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ప్రస్తుతం సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఏప్రిల్ చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా ఎల్ నినో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 0.5 నుంచి 1 డిగ్రీ పెరగడంతో ఎల్ నినో ప్రభావం ఏర్పడి, దక్షిణ భారతదేశంపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎల్ నినో కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడి, వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. వేసవి కాలం మరింత తీవ్రంగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ముఖ్యంగా మే, జూన్ నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశమూ ఉందని అధికారులు చెబుతున్నారు.
