క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్లోని బేగంపేటలో గురువారం పూజ చేస్తున్న సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 62 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి దుర్మరణం చెందారు. విజయలక్ష్మి తన ఇంట్లో నిత్య పూజలో భాగంగా దీపం వెలిగిస్తుండగా, ఆమె చీరకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. మంటలు అంటుకోవడంతో ఆమె భయాందోళనకు గురై బెడ్రూమ్లోకి పరిగెత్తారు.
ఆ క్రమంలో మంటలు అక్కడి దుప్పటికి వ్యాపించి ఉధృతమయ్యాయి. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె పదవీ విరమణ తర్వాత ఒంటరిగా నివసిస్తున్నారు. అదే భవనంలోని పై అంతస్తులో ఆమె కుమార్తె ఉంటున్నారు. స్థానికులు ఇళ్లలోంచి పొగలు రావడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
