రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా సమాన హక్కులు, అవకాశాలు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగ ఫలితంగానే నేడు అణగారిన వర్గాల వారు ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారని పేర్కొన్నారు.వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.
