-
గట్టిగానే గ్రౌండ్ వర్క్
-
ప్రజలతో మమేకం కావడమే లక్ష్యం
-
మాస్ ఇమేజ్ కోసం తహతహ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పూర్వవైభవానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తహతహలాడుతున్నారు. త్వరలోనే ఆయన రాష్ట్రవ్యాప్తంగా భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని మళ్లీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి, తన సొంత ఇమేజ్ను మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ పాదయాత్రను ఒక బ్రహ్మాస్త్రంగా ఆయన భావిస్తున్నారు. పార్టీకి ఇది అత్యంత క్లిష్ట సమయం కావడంతో సాహస నిర్ణయాలు ఉండాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.
చాలా సులువుగా ఎంట్రీ..
తెలంగాణ రాజకీయాల్లో సులువుగా ప్రవేశించగలిగారు కేటీఆర్. తెలంగాణ సెంటిమెంట్ పతాక స్థాయిలో ఉండగా.. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. సులువుగానే ఆయన రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా, అప్పారమైన అధికార బలంతో కార్పొరేట్, క్లాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే ఆశించిన స్థాయిలో మాస్ ఇమేజ్ ఆయనకు దక్కలేదు. అది దక్కాలంటే కచ్చితంగా ఇప్పుడు పాదయాత్ర చేయాల్సిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు చెప్పడం కంటే దూకుడుగా అడుగులు వేయడమే ముఖ్యం. ఇప్పుడు ఆ పనికి సిద్ధపడుతున్నారు కేటీఆర్. ప్రజలతో మమేకం కావడానికి పాదయాత్ర సరైన మార్గం అని భావిస్తున్నారు.
పాదయాత్ర సక్సెస్..
తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన ఏ నేత కూడా ఓడిపోలేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇలా అందరూ అధికారంలోకి వచ్చిన వారే. రేవంత్ రెడ్డి సైతం విధానపరమైన అంశాల విషయంలో పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే ఫార్ములాను ఒడిసి పట్టుకోవాలని భావిస్తున్నారు కేటీఆర్. ఏపీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.
అప్పట్లో కూడా కేటీఆర్ మాదిరిగానే లోకేష్ విమర్శలు ఎదుర్కొనేవారు. కేవలం సోషల్ మీడియాలో స్పందించే నాయకుడిగానే చూసేవారు. అదే లోకేష్ లో పట్టుదల పెంచింది. సుదీర్ఘకాలం పాదయాత్ర చేసేలా చేసింది. లోకేష్ తన భాషా యాసను కూడా మార్చుకున్నారు. పూర్తి పరిపక్వత కలిగిన నాయకుడిగా పాదయాత్ర ద్వారా తనను తాను తీర్చిదిద్దుకున్నారు.
అయితే లోకేష్ తో పోల్చుకుంటే కేటీఆర్ మంచి వాగ్దాటి ఉన్న నేత. కానీ మాస్ ఫాలోయింగ్ లేదు. ఇప్పుడు పాదయాత్ర ద్వారా మాస్ ఫాలోయింగ్ దక్కించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత విషయంలో ప్రత్యేక ఆలోచనతో ఉన్నారు కేటీఆర్. అందుకే గట్టిగానే తన పాదయాత్రకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.