Panjagutta Police Register Case Against Mangli: సింగర్ మంగ్లీ ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా ఈమెపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్టుబడుల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేశారనే ఆరోపణలతో పాటు, న్యాయవాదిని బెదిరించారనే విషయంపై ఈ కేసును ఫైల్ చేశారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. మంగ్లీ, ఆమె సోదరుడు శివతో కలిసి మరికొంత మంది దాదాపు 100 మందికి పైగా వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకున్నారని తెలుస్తోంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పి ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, నిర్ణయించిన కాలం గడిచినా లాభాలు ఇవ్వకపోవడంతో పాటు, పెట్టిన డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు.
న్యాయవాదిపై బెదిరింపులు
ఈ నేపథ్యంలో బాధితులు న్యాయం కోసం న్యాయవాది సుబ్బారావును సంప్రదించారు. ఆయన ఈ విషయంపై స్పందించి డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో వివాదం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మంగ్లీ, ఆమెతో సంబంధం ఉన్నవారు న్యాయవాదిని ఫోన్ ద్వారా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయవాది సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం, మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు దర్శకుడు వేణు ఊడుగుల కూడా తనను ఫోన్లో బెదిరించారని, ప్రమాదం కలిగించి చంపేస్తామని హెచ్చరించారని చెప్పారు. ఈ సంఘటనతో తనకు ప్రాణహాని ఉందని ఆయన పోలీసులను ఆశ్రయించారు.
మంగ్లీ, వేణు ఉడుగుల సహా పలువురిపై కేసు
ఈ ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, మంగ్లీ, శివ, వేణు ఊడుగుల మరియు మరికొంత మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్గా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.వరుసగా హిట్ పాటలతో కెరీర్లో ముందుకెళ్తున్న మంగ్లీపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిజానిజాలు ఏమిటో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
