పశ్చిమాసియాలో పరిస్థితులు కొంత శాంతించినట్టే కనిపిస్తున్నప్పటికీ, భారత్లో చమురు ధరలు త్వరగా తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన భద్రతపై మరింత దృష్టి పెట్టింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలపరచడానికి కీలక చర్యలు తీసుకుంటోంది.
గల్ఫ్ కు కేంద్ర మంత్రులు
ఈ క్రమంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ గల్ఫ్ పర్యటన ప్రారంభించారు. ఆయన గురువారం ఖతార్కు వెళ్లారు. అక్కడ రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఎల్ఎన్జీ (ద్రవీభవించిన సహజ వాయువు) సరఫరాలపై అక్కడి అధికారులతో చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు మారుతూ ఉండటంతో, భారత్కు స్థిరమైన సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ఈ పర్యటన జరుగుతోంది.
జైశంకర్ కూడా..
ఇక విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కూడా గల్ఫ్ దేశాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన ముందుగా మారిషస్ వెళ్లి, అక్కడి నుంచి యూఏఈకి చేరుకుంటారు. ఈనెల 11, 12 తేదీల్లో జరిగే సమావేశాల్లో ఇంధన భద్రత, వాణిజ్య సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. యూఏఈతో భారత్కు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్ట్యా ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా యుద్ధ ప్రభావం వల్ల చమురు ధరలు స్థిరంగా లేకపోవడం భారత్కు సవాలుగా మారింది. దేశంలో ఇంధన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో, విదేశీ సరఫరాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే గల్ఫ్ దేశాలతో చర్చలు జరిపి, సరఫరాలను నిర్ధారించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. చమురు ధరలు తగ్గకపోయినా, ముందస్తు చర్యలతో భవిష్యత్తులో ఇంధన సమస్యలు రాకుండా చూసుకోవడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
