హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కేవలం మహబూబ్నగర్ జిల్లాకే కాకుండా, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రిజర్వాయర్లు పూర్తయినా, కాలువలు పూర్తి కాకపోవడం వల్ల రైతులకు నీరు అందడం లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు.
వచ్చే సాగు సీజన్ నాటికి ప్రధాన కాలువలతో పాటు డిస్ట్రిబ్యూటరీ పనులన్నీ పూర్తి కావాలని ఆదేశించారు.పెండింగ్లో ఉన్న భూసేకరణ సమస్యలను పరిష్కరించడానికి ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పంప్ హౌస్లలో మిగిలి ఉన్న మోటార్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్ల వద్ద పనులను నిరంతరం పర్యవేక్షించాలని సాగునీటి శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలను పనుల పురోగతిని బట్టి విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నా సొంత జిల్లా, వెనుకబడిన ప్రాంతాల ఆశ. గత పదేళ్లుగా ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగింది. ఇకపై జాప్యం జరిగితే సహించేది లేదు. ప్రతి ఎకరాకు నీరు అందే వరకు ఈ పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
