పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్రం నిర్ణయం
ప్రత్యేక సమావేశాలు రెండు రోజులపాటు నిర్వహణ
ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహం
క్రైమ్ మిర్రర్, ఢిల్లీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సిద్ధమయ్యింది. అయితే ఈ నెలలోనే పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి 2026 తర్వాతే అని చట్టంలో స్పష్టం చేశారు. ఆ గడువు ముగుస్తుండడంతో ఇప్పుడు ఈ పునర్విభజన ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు మహిళా బిల్లుకు సంబంధించిన అంశాలు సైతం పునర్విభజనతో లింక్ అయ్యాయి. అందుకే వీలైనంత త్వరగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించాలని చూస్తోంది కేంద్రం.
దేశవ్యాప్తంగా సమానంగా పెంపు..
ఇప్పుడు ఉన్న లోక్సభ స్థానాలకు 50 శాతం వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే జనాభా ప్రాతిపదికన పెంచితే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం వస్తుంది. అది అంతిమంగా ప్రాంతీయ విభజనకు కారణం అవుతుంది. అందుకే మధ్య మార్గంగా ఒక ఫార్ములాను అనుసరించనుందట కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణకు పూనుకున్నాయి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ. అందుకే దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయితే దేశంలో ప్రతి రాష్ట్రానికి సమాన ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచేందుకు కేంద్రం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న నియోజకవర్గాలు…
ప్రస్తుతం లోక్సభలో 543 ఎంపీ స్థానాలు ఉన్నాయి. పునర్విభజనతో ఆ సంఖ్య 780 నుంచి 850 వరకు పెంచాలని కేంద్రం నిర్ణయించుకుంది. అదే స్థాయిలో శాసనసభ స్థానాలు కూడా పెరగనున్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం కూడా పెరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారీగా నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా తెలంగాణలో బిజెపికి అనుకూలంగా పునర్విభజన ప్రక్రియ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. మరోవైపు ఏపీలో సైతం నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా మరో 13 వరకు పెరిగి ఆ సంఖ్య 38 కి చేరనుంది. తెలంగాణలో ప్రస్తుతం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మరో 8 వరకు పెరిగి 25 కు ఆ సంఖ్య చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఆశావహులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.
