ప్రేమించిన కూతురినే కన్న తండ్రి క్రూరంగా హత్య చేసిన ఘోర ఘటన ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల పట్టణంలో వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కడుపున పుట్టిన పిల్లలపై ప్రేమ చూపాల్సిన తండ్రే కాలయముడిగా మారి అమానుషానికి ఒడిగట్టిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. మాచర్ల పట్టణంలోని 22వ వార్డు యాదవ బజార్కు చెందిన చంద్రశ్రీనుకు ఇద్దరు పిల్లలు ఉండగా, కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ వరకు చదివి ఇంట్లోనే ఉండేది. ఈ క్రమంలో సమీపంలో నివసించే జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజుతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ, కుటుంబ సభ్యులు తమ ప్రేమను అంగీకరించరని భావించిన ఈ జంట ఇంటి నుంచి వెళ్లి పెళ్లి చేసుకుంది. అనంతరం కొద్ది రోజుల పాటు చెన్నైలో ఉండి, తర్వాత నర్సరావుపేటలో స్నేహితుడి ఇంట్లో నివసించారు.
కూతురు కనిపించకపోవడంతో చంద్రశ్రీను పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారం రోజులైనా సమాచారం లభించకపోవడంతో ఆగ్రహానికి లోనై మాచర్ల పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి కూడా యత్నించాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన గురజాల డీఎస్పీ జోక్యం చేసుకుని యువతిని గుర్తిస్తామని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి అతడు వెళ్లిపోయాడు. ఈ సంఘటన తర్వాత 3 రోజులకే పోలీసులు చౌడేశ్వరి, నాగరాజు జంటను గుర్తించి మాచర్ల పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చర్చలు జరిపిన పోలీసులు, ఇద్దరూ మేజర్లు కావడంతో తాము జోక్యం చేసుకోలేమని తెలిపారు. అనంతరం వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించగా, పెద్దల మధ్య పంచాయితీ జరిగింది.
ఆ పంచాయితీలో చౌడేశ్వరి తన భర్త నాగరాజుతోనే జీవించాలని స్పష్టంగా చెప్పినప్పటికీ, పెద్దలు తాత్కాలికంగా 5 రోజుల పాటు వేరువేరుగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో చౌడేశ్వరిని తన ఇంటికి తీసుకువచ్చిన చంద్రశ్రీను, మరుసటి రోజు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ప్రకటించాడు. మొదట్లో ఈ ఘటనను కుటుంబ వివాదంతో మనస్థాపానికి గురై చేసిన ఆత్మహత్యగా అందరూ భావించారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. చౌడేశ్వరిని ముందుగా గొంతు నులిమి హత్య చేసి, ఆ తరువాత ఉరివేసినట్లు తేలింది. దీంతో ఈ కేసు మలుపు తిరిగింది. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు చంద్రశ్రీనును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపంతో కన్న కూతురినే హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా మలచేందుకు ప్రయత్నించిన తండ్రి ప్రవర్తనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కుటుంబ గౌరవం పేరుతో జరుగుతున్న అమానుష చర్యలపై మరోసారి చర్చకు దారి తీసింది.
ALSO READ: మందారం పూలు రాత్రికే రాత్రే బస్తాలకు బస్తాలు పూయాలంటే ఏం చేయాలో తెలుసా?
