భార్య భరణంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసేలా కీలక తీర్పు వెలువడింది. అలహాబాద్ హైకోర్టు మంగళవారం ఇచ్చిన ఈ తీర్పులో, భార్యను పోషించడం భర్తకు చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా, అతను మరణించిన తర్వాత కూడా ఆ బాధ్యత పూర్తిగా ముగిసిపోదని స్పష్టం చేసింది. భర్త మరణించిన తర్వాత కూడా భార్యకు భరణం పొందే హక్కు కొనసాగుతుందని కోర్టు పేర్కొంది.
ఈ కేసులో అకుల్ రస్తోగి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. జస్టిస్ అరిందమ్ సిన్హా, జస్టిస్ సత్య వీర్ సింగ్లతో కూడి ఉంది. విచారణ సందర్భంగా భర్త తరఫు న్యాయవాది, భార్య తన ఆర్థిక పరిస్థితిని పూర్తిగా వెల్లడించకుండా భరణం కోరుతోందని వాదించారు. ఆమె తన వద్ద ఉన్న డిపాజిట్ల వివరాలను దాచిపెట్టి, గృహిణిగా చూపించుకుందని ఆరోపించారు.
అయితే విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు వేరే విధంగా ఉన్నాయి. మహిళ వద్ద ఉన్న డిపాజిట్లు ఆమె తండ్రి నుంచి వచ్చినవని, అందులో ఎక్కువ భాగం ఇప్పటికే ఉపసంహరించబడినట్లు కోర్టు గమనించింది. దీంతో ప్రస్తుతం ఆమెకు ఆర్థిక సహాయం అవసరం ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఆరోపణలను బలపరిచే సరైన ఆధారాలు సమర్పించడంలో భర్త తరఫు లాయర్ విఫలమైయ్యారని కూడా కోర్టు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భర్త మరణించిన తర్వాత అతని ఆస్తి నుంచి భార్య భరణం పొందవచ్చని, ఒక వేళ ఆస్తి సరిపోకపోతే అత్తమామల నుంచి కూడా భరణం కోరే హక్కు వితంతు మహిళకు ఉంటుందని పేర్కొంది. అయితే ఇది కొన్ని చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉంటుందని కూడా స్పష్టం చేసింది.
అదే సమయంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, భార్యకు భరణం అందించడం భర్త బాధ్యతేనని మరోసారి నొక్కిచెప్పింది. భర్త మరణంతో ఆ బాధ్యత పూర్తిగా ముగిసిపోదని, వితంతు స్త్రీకి ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసులకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
ALSO READ: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
