హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: అత్యాచారానికి గురైన బాధితుల ఆత్మగౌరవం, గోప్యతను కాపడాల్సిన విషయంలో దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యాచార బాధితుల వివరాలను ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాలో ముద్రించ కూడదని తెలిపింది. బాదితుల వివరాలు పేర్లు బహిర్గతం చేయడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖచ్చితమైన మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేసింది.
ఇది వరకు వెల్లడించిన తీర్పుల్లో బాధితులు, వారి కుటుంబీకుల పేర్లను ప్రస్తావించడం వల్ల వారు మానసిక క్షోభకు గురవుతారని ధర్మాసనం పేర్కొంది. బాధితుల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచడం వారి సామాజిక భద్రతకు అత్యంత ముఖ్యమని కోర్టు ఆదేశించింది. వార్తా సంస్థలు ఈ తరహా కేసులను నివేదించేటప్పుడు బాధితులకు ఇబ్బంది కలగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వ అధికారులు ఛార్జ్షీట్లు లేదా ఇతర అధికారిక పత్రాల్లో బాధితుల గుర్తింపు బయటపడకుండా చూడాలని కోర్టు హెచ్చరించింది.
