-
శ్రీరామనవమి వేడుకలతో సత్తా చాటిన గోషామహల్ ఎమ్మెల్యే
-
బిజెపిలోకి ఎంట్రీకి హై కమాండ్ గ్రీన్ సిగ్నల్
-
ఫలించిన యూపీ సీఎం యోగి మంత్రాంగం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: రాజాసింగ్ తిరిగి బీజేపీలో చేరెందుకు ముహూర్తం ఖరారు అయ్యిందా? షరతులతో ఆయనను పార్టీలో చేర్చుకుంటారా? హై కమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ త్వరలోనే అది సాధ్యమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మొన్నటికి మొన్న శ్రీరామనవమి నాడు పాతబస్తీలో భారీ ర్యాలీ నిర్వహించి సత్తా చాటారు రాజాసింగ్. చంపేస్తామని బెదిరింపులు వచ్చిన ఆయన వెనక్కి తగ్గలేదు. ఏకంగా పాత బస్తీలో వేలాది మందితో ర్యాలీ తీశారు. జైశ్రీరామ్ నినాదాలతో పాత బస్తి మార్మోగిపోయింది. రాజాసింగ్ లాంటి దూకుడు కలిగిన నేతను వదులుకోకూడదని బిజెపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మునుపటి మాదిరిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దన్న షరతుతో తిరిగి పార్టీలోకి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది.
-
హ్యాట్రిక్ విజయం..
బిజెపి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు రాజాసింగ్. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం.. ఎన్నికలకు ముందు పార్టీలోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించడంలో ముందుంటారు రాజాసింగ్. గతంలో హిందుత్వవాదం విషయంలో బిజెపి హై కమాండ్ తో విభేదించి బయటకు వెళ్లిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి బిజెపిలో చేరారు. గోషామహల్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన ఆయన.. ప్రోటెం స్పీకర్ గా ఎంఐఎం నేత ఉండడంతో పదవికి ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. మళ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ వచ్చిన తర్వాత మాత్రమే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంతలా హిందుత్వవాదం విషయంలో పట్టుదలగా ఉండే నేత. గోషామహల్తో పాటు పాత బస్తీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న నేత రాజాసింగ్.
-
బిజెపి రాష్ట్ర పగ్గాలు కావాలని..
బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోరుకున్నారు రాజాసింగ్. మూడుసార్లు బిజెపి అభ్యర్థిగా విజయం సాధించిన తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అవసరం అనుకుంటే ఓటింగ్ ద్వారానైనా తానే అధ్యక్షుడిని అవుతానని నమ్మకంగా చెప్పారు. అయితే బిజెపి హై కమాండ్ అధ్యక్షుడిగా రామచంద్రరావును ఎంపిక చేసింది. ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తానని రాజాసింగ్ పట్టుబట్టారు. అందుకు హై కమాండ్ అంగీకరించకపోవడంతో రాజాసింగ్ బిజెపి ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నారు. అయితే హై కమాండ్ సైతం ఆయనను ఒప్పించే ప్రయత్నం చేయలేదు. అయితే ఆయన రకరకాలుగా చాలా పార్టీల్లో చేరుతారని ప్రచారం నడిచింది. కానీ చివరకు బిజెపిలోనే కొనసాగేందుకు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
-
టిడిపి ద్వారా ఎంట్రీ..
తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రాజాసింగ్. ఆ పార్టీ తరపున 2009లో కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఆ పదవిలో 2014 వరకు కొనసాగారు. తర్వాత బిజెపిలో చేరి ఆ పార్టీ టికెట్ పై అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. 2018, 2023 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. అయితే రాష్ట్ర పగ్గాలు అందుకోవాలని భావించారు. హై కమాండ్ ఇవ్వకపోవడంతో రాజీనామా చేశారు. వేరే ఆప్షన్ లేకపోవడంతో బీజేపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ద్వారా పెద్దలతో మాట్లాడారు. బిజెపి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకే శ్రీరామనవమి వేడుకలను ఓ రేంజ్ లో జరిపి ఆకట్టుకున్నారు రాజాసింగ్.
