పార్టీకి భారీ డ్యామేజ్
సీఎం చంద్రబాబు ఆవేదన
ఇటువంటి వారిని పార్టీ మోయాలా అంటూ కామెంట్స్
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ బ్యూరో: ఏపీలో ప్రభుత్వ పెద్దలు బాగానే పనిచేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీల వ్యవహార శైలి కూటమికి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా వరుసగా వస్తున్న లైంగిక ఆరోపణల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించాలని చూస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయడం ద్వారా కూటమిని ఎరకాటంలో పెట్టాలని చూస్తోంది. ప్రధానంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంతో టిడిపిలో ఒక్క రకమైన ఆందోళన కనిపిస్తోంది. పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది ఆ పార్టీ. దాని నుంచి అధిగమించేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగింది. షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఐదు రోజుల్లో సమాధానం చెప్పాలని కోరింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో గంజాయి రాజ్యమేలిందని.. దాని నుంచి నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు ప్రకటనలు చేశారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎంపీపై డ్రగ్స్ కేసు నమోదు కావడం ఆ పార్టీకి నిజంగా మైనస్.
చంద్రబాబు సీరియస్..
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ విషయంలో సీరియస్ గా ఉన్నారు. పార్టీని ఇబ్బందుల్లో పెట్టిన ఇటువంటి వారిని మోయాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటివి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
తద్వారా గట్టిగానే చర్యలకు దిగాలని భావిస్తున్నారట చంద్రబాబు. ముఖ్యంగా రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వారితోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని కామెంట్స్ చేయడం ద్వారా చంద్రబాబు ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారని అర్థమవుతోంది. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై గతంలోనే చాలా ఫిర్యాదులు వచ్చాయని.. ఇకనుంచి సహించేది లేదని చెప్పడం ద్వారా చంద్రబాబు సీరియస్ యాక్షన్ లోకి దిగుతున్నట్లు అర్థమవుతోంది.
సానుకూలతలు ఉన్నా..
ప్రభుత్వంపై సానుకూలత ఉంది. ప్రభుత్వ పెద్దలపై సానుకూలత ఉంది. కానీ కొందరు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీల వ్యవహార శైలి మాత్రం విమర్శలకు గురిచేస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ లైంగిక ఆరోపణలతో పాటు డ్రగ్స్ వంటి మరక టిడిపికి అంటుకుంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఏ తరహా ఆరోపణలు అప్పట్లో కూటమి చేసిందో.. అదే తరహా ఆరోపణలు ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వంపై వస్తున్నాయి. ఇది నిజంగా ఆందోళనకు గురి చేసే విషయమే.
మంచి అవకాశం కల్పించినా..
అయితే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ విషయంలో చంద్రబాబు సీరియస్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు మహేష్ కుమార్ యాదవ్. మొన్నటి ఎన్నికల్లో ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు.
మహేష్ కుమార్ యాదవ్ తండ్రి సుధాకర్ యాదవ్ కు ఎమ్మెల్యే గాను.. ఆయన భార్యకు ఎమ్మెల్యే గాను ఛాన్స్ ఇచ్చారు. ఇన్ని అవకాశాలు ఇస్తే పార్టీని డ్యామేజ్ చేసే విధంగా వ్యవహరించారని చంద్రబాబు ఆవేదన. ఇటువంటి వారు ఓ నలుగురు వరకు పార్టీలో ఉన్నారని బాధపడుతున్నారు. వారిపై వేటు తప్పదని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?
