Homeజాతీయంప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి.. ఎల్‌పీజీపై కీలక ప్రకటన

ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి.. ఎల్‌పీజీపై కీలక ప్రకటన

ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచ ఇంధన రంగంపై తీవ్రంగా పడుతుండగా, ఎల్‌పిజి సరఫరాలపై ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. యుద్ధం ప్రారంభమై 20 రోజులు గడిచినా కీలక సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి గుండా కేవలం 9 ముడి చమురు, గ్యాస్ నౌకలు మాత్రమే ప్రయాణించడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. ఈ పరిణామాల ప్రభావం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పిజి సరఫరాలపై పడటంతో కొరత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ పరిస్థితి సవాలుతో కూడుకున్నదేనని అంగీకరించింది.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. దేశంలో గృహ వినియోగదారులకు 100 శాతం ఎల్‌పిజి సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయినప్పటికీ అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని పేర్కొన్నారు. ఇటీవల ప్రజల్లో నెలకొన్న భయాందోళనల కారణంగా అధికంగా గ్యాస్ బుకింగ్‌లు జరిగినప్పటికీ, ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టాయని తెలిపారు. అవసరానికి మించిన బుకింగ్‌లు చేయకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను కూడా పరిశీలించుకోవాలని సూచనలు జారీ చేశారు. సరఫరా వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, కానీ పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పట్టవచ్చని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా కఠిన చర్యలు చేపట్టినట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల్లో మొత్తం 4,500కు పైగా దాడులు నిర్వహించి అక్రమ నిల్వలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ అందించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇక దేశీయ ఉత్పత్తిని పెంచడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం దేశీయ ఎల్‌పిజి ఉత్పత్తి సుమారు 40 శాతానికి చేరుకోవడంతో దిగుమతులపై ఆధారపడటం కొంతవరకు తగ్గిందని అధికారులు తెలిపారు. అయితే అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరఫరా వ్యవస్థపై ఒత్తిడి ఇంకా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రతపై కూడా ప్రభుత్వం నిశితంగా నిఘా ఉంచుతోంది. 22 భారతీయ నౌకలు, నావికులు సురక్షితంగా ఉన్నారని రాకేష్ సిన్హా తెలిపారు.

విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరాల ప్రకారం.. ప్రధానమంత్రి పలు గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచ నాయకులతో చర్చలు జరిపి దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వంటి నేతలతో కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. మొత్తం మీద ఎల్‌పిజి సంక్షోభం తాత్కాలికమైనదే అయినప్పటికీ, పరిస్థితి పూర్తిగా సాధారణం కావడానికి అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది.

ALSO READ: ఈ శంఖం వెంటే లక్ష్మీదేవి..!

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు