మేడ్చల్, క్రైమ్ మిర్రర్: ఉప్పల్ పీఎస్ పరిధి చిలకానగర్ లో ఆదివారం రాత్రి కత్తిపోట్లతో ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైన ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. వివరాల ప్రకారం చెంగిచెర్లలోని ఆర్టీసీ కాలనీకి చెందిన సుధీర్ కుమార్ (39), హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.
ఆదివారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఆదర్శనగర్, చిల్కానగర్లోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉండగా, అతని స్నేహితుడైన సంతోష్ నాయక్ కత్తితో సుధీర్ కుమార్పై విచక్షణ రహితంగాదాడిచేయడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. మృతుడు, నిందితుడు ఇద్దరూ స్నేహితులేనని, అయితే హత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడు సంతోష్ నాయక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
