ఇటీవలి కాలంలో ఫుడ్ డెలివరీ సేవల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇంట్లో నుంచే ఆహారం తెప్పించుకునే అలవాటు ఇప్పుడు చాలా మందికి సాధారణంగా మారింది. ఆకలి వేసినప్పుడు వెంటనే మొబైల్ తీసుకుని ఫుడ్ డెలివరీ సేవల ద్వారా కావాల్సిన వంటకాలను ఎంచుకుని ఆర్డర్ చేయడం సాధారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఈ సేవల వినియోగం మరింత ఎక్కువగా ఉంది. రకాల రకాల ఆఫర్లు, ధర తగ్గింపులు, త్వరిత సరఫరా వంటి సౌకర్యాల వల్ల ప్రజలు ఈ విధానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వంటి వంటకాలను ఎక్కువగా ఆర్డర్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఆఫర్లు ఉన్నప్పుడు మరింత మంది వినియోగదారులు ఆహారం ఆర్డర్ చేయడానికి ముందుకు వస్తున్నారు.
అయితే ఆన్లైన్లో ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని సమస్యలు కూడా అప్పుడప్పుడు బయటపడుతున్నాయి. వినియోగదారులు ఆర్డర్ చేసిన వంటకం ఒకటైతే పంపబడే వంటకం వేరుగా ఉండటం వంటి ఫిర్యాదులు తరచుగా వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో నాణ్యతపై కూడా వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తుంటాయి. వినియోగదారులు ఆహారం తీసుకున్న తర్వాత అందులో అనుమానాస్పద వస్తువులు కనిపించాయని చెప్పి ఫిర్యాదులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఇలాంటి మరో సంఘటన తాజాగా ఉత్తర భారతదేశంలోని కాన్పూర్ నగరంలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి జొమాటో ద్వారా మటన్ బిర్యానీ ఆర్డర్ చేసినట్లు సమాచారం. అయితే అతనికి వచ్చిన బిర్యానీలో ఉన్న మాంసం ముక్కలపై అతనికి అనుమానం వచ్చింది. వాటి ఆకారం చూసి అది మటన్ మాంసం కాదని, కుక్క కాలు లాంటి ముక్కలు పంపించారని అతను ఆరోపించాడు. దీంతో ఆ వ్యక్తి ఫుడ్ ప్యాకెట్ను తెరిచి వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఆ వీడియోలో బిర్యానీలో ఉన్న మాంసం ముక్కలను చూపిస్తూ తాను మటన్ బిర్యానీ ఆర్డర్ చేసినప్పటికీ వేరే మాంసం పంపించారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియో తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. చాలా మంది ఈ ఘటనపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫుడ్ డెలివరీ సంస్థలపై ప్రశ్నలు లేవనెత్తగా, మరికొందరు నిజానిజాలు వెలుగులోకి రావాలని కోరుతున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కూడా విషయం గురించి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. బిర్యానీలో ఉన్న మాంసం నిజంగా ఏ జంతువుకు చెందినదో అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైతే ఆహార నమూనాలను పరీక్షలకు పంపించే అవకాశం కూడా ఉందని సమాచారం. పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాతే అసలు విషయం ఏమిటి అనేది స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు.
ALSO READ: కాబోయే భార్యను వీడియోలు తీసిన వరుడు.. పెళ్లి కుమార్తె, ఆమె తల్లి ఆత్మహత్య
