శిల్పుల నైపుణ్యాన్ని ప్రతిభింభిస్తుంది
శ్రీకోదండరామాలయం విశేషాల నిలయం
ఆనాటి రాచరిక ఘట్టాలకు ప్రతీక
రామయ్య నడియాడిన నేలగా ప్రసిద్ది
తిరుపతి / ఒంటిమిట్ట, క్రైమ్ మిర్రర్.అధ్యాత్మీక పుణ్య క్షేత్రంగా ఏకశిల నగరం విశేషాల ఝరిగా ప్రసిద్ది కెక్కింది. ఒంటి మిట్ట ఆలయం అనేక శిల్ప కళకు ప్రత్యేక నిదర్శనంగా నిలుస్తుంది. ఒకే శిలపై కొలువైన సీతారామ లక్ష్మణులు భక్తులను విశేషంగా ఆకట్టుంటాయి. ఎటుచూసిన శిల్ప కళ మహాద్భుతంగా ఉంటుంది.ఎత్తయిన గోపురాలు, విదేశీయులు సైతం మెచ్చిన దర్పణంగా విలసిల్లుతూ ఇలా ఎన్ని చెప్పకుంటూపోయిన ప్రతీది దివ్య స్వరూపమే…!
కడప జిల్లాలోని పవిత్ర క్షేత్రం ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయం అద్భుత శిల్ప సంపదకు నిలయంగా భక్తుల మన్ననలు చూరగొంటుంది. ఈ ఆలయంలోని శిల్పాలు విజయనగర కాలం శిల్పకళ వైభవాన్ని స్మరింపజేస్తాయి. ముఖ్యంగా రంగమండపంలోని యాళి స్తంభాలు దర్శనార్థులను ఆకట్టుకుంటాయి.

భారీ గండశిలలను యాళి స్తంభాలుగా మలచిన తీరు శిల్పుల అపూర్వ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.రాయల వంశ కాలంలో నిర్మితమైన అనేక ఆలయాలలో యాళి స్తంభాలు కనిపిస్తాయి. అయితే ఒంటిమిట్ట ఆలయంలో ఒక్కో స్తంభం మధ్యలో నిలువుగా ఖాళీ స్థలం ఉండి, అందులో ఒక వ్యక్తి కూర్చోగలిగే విధంగా ఉండటం ప్రత్యేకతగా నిలుస్తుంది.
రంగమండపంలోని స్తంభాలపై పురాణ ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు ఎంతో అందంగా చెక్కబడి భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. వాటిలో రెండు స్తంభాలు సంప్రదాయ పేట్రస్ శైలిలో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడి ఆకర్షణీయంగా నిలుస్తాయి.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చరిత్ర…
పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తున్న సమయంలో, సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోకి బాణం సంధించగా అక్కడ నీటి బుగ్గ ఉద్భవించింది. అదే నేటి ఒంటిమిట్టలోని పవిత్ర రామతీర్థంగా భావిస్తారు.
రావణ సంహారం కోసం శ్రీరాముడికి సహకరించిన జాంబవంతుడు సేవించిన శ్రీ సీతా లక్ష్మణ సమేత రామచంద్రుడే నేడు ఒంటిమిట్ట ఆలయంలో కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం. ఒకే రాతిపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడినందున ఈ ప్రాంతాన్ని “ఏకశిలా నగరం” అని కూడా పిలుస్తారు.
రాచరికం…
ఆలయంలోని శాసనాల ప్రకారం ఈ దేవాలయ నిర్మాణం 14వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దానికి పూర్తయింది. 1356లో బుక్కరాయలు ప్రారంభించిన ఈ నిర్మాణాన్ని అనంతరం విజయనగర రాజులు, మట్లి రాజులు అభివృద్ధి చేశారు. అంతరాలయం, రంగమండపం, మహా ప్రాంగణం, గోపురాలు వంటి నిర్మాణాలు ఈ కాలంలో నే నిర్మితమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా నేడు భక్తులను కనువిందు చేస్తున్నాయి.
