చలికాలం పూర్తిగా ముగిసిందో లేదో తెలియకముందే ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ అధికారులు కీలక హెచ్చరిక జారీ చేశారు. మార్చి నెల ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వేడి ప్రభావం క్రమంగా అధికమవుతుందని, ముఖ్యంగా మార్చి 3 నుండి 7 వరకు ఉష్ణోగ్రతల్లో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ కాలంలో పగటి వేళ ఎండలు తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశముందని, బయటకు వెళ్లే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 తర్వాత నుండి సాయంత్రం 4 వరకు ఎండ ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశముందని, అవసరం లేకుండా బయట సంచారం తగ్గించడం మంచిదని హెచ్చరించారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వేడి తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుందని అంచనా వేస్తున్నారు. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39 నుండి 41 వరకు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. ఈ స్థాయి వేడి సాధారణ స్థాయిని మించి ఉండటంతో వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఉష్ణోగ్రతలు 36 నుండి 37 వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో 37 నుండి 39 వరకు నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
వేసవి కాలం అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, నేరుగా ఎండలో ఎక్కువసేపు నిలబడకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. శరీరంలో నీరు తగ్గిపోవడం వల్ల అలసట, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు మధ్యాహ్న సమయంలో పనులు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ మార్పులు రాబోయే వారాల్లో మరింత వేడి పరిస్థితులకు సంకేతాలిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: Middle East Crisis: హైదరాబాద్ టూ అరబ్ దేశాల సర్వీసులు నిలిపివేత!
