హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ రాజకీయాలతో పేదల ఇండ్లతో పాటు ఇప్పుడున్న దేవాలయాలు, మఠాలను సైతం కూల్చేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో హరీశ్రావు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రేవంత్ రెడ్డి పాలన తయారైందని హరీశ్రావు అన్నారు. అడ్డగోలు వ్యవహారాలకు, అక్రమాలకు పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్ప్పుడు ఏకంగా దేవాలయాలు, మఠాలను కూడా కూల్చే స్థాయికి దిగజారిందని విమర్శించారు.
2019లో కేసీఆర్ ప్రభుత్వంలో కోకాపేట సర్వే నెంబర్ 240లో విశాఖ శారద పీఠానికి చట్టబద్ధంగా క్యాబినెట్ ఆమోదంతో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించామని తెలిపారు. పీఠం నిర్వాహకులు ప్రభుత్వానికి 1.05 కోట్లు చెల్లించి రిజిస్టేష్రన్ కూడా చేసుకున్నారని పేర్కొన్నారు. అలాగే హెచ్ఎండీఏ కు రూ. 23 లక్షలు చెల్లించి అనుమతులు, విద్యుత్ కనెక్షన్ అన్నీ తీసుకున్నారని చెప్పారు.
ఇక్కడ అద్భుతమైన శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయం, గోశాల, నిత్య అన్నదాన సత్రం, వేద పాఠశాల నిర్మించారని అన్నారు. హైదరాబాద్లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చావు, ఖమ్మంలో ఇళ్లు కూల్చి 800 మందిని రోడ్డున పడేశావు. నీ పాలనలో అంతా కూల్చడమే తప్ప, నిర్మాణం లేదా అని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్లుడికి వ్యాపారం చేసుకోవడానికి 17 ఎకరాలు ఇస్తావు కానీ.. హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే శారద పీఠానికి ఉన్న రెండు ఎకరాలను మాత్రం లాక్కుని కూలుస్తావా అని మండిపడ్డారు. ఉదయం నేను ఇక్కడికి వస్తున్నానని తెలియగానే పోలీసులు, ఆర్ఐ, తహసీల్దార్ అందరూ పారిపోయారని హరీశ్రావు తెలిపారు. దొంగల్లా దాక్కోవాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చిందని ప్రశ్నించారు.
ఉదయం స్వాములు పూజలు చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని.. దేవాలయంలో ఏళ్ల తరబడి జరుగుతున్న పూజలను ఆపే హక్కు, ధైర్యం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారని నిలదీశారు. స్వావిÖజీ గారు వాగ్వాదానికి దిగాక అరగంట తర్వాత పూజకు అనుమతించారని తెలిపారు.దేవుని మీద పడ్డవాడు ఎవడూ బాగుపడలేదు..
నీకేదో పోయేగాలం దాపురించింది, ఆ దేవుడి శాపం నీకు తప్పక తగులుతుందని అన్నారు. క్యాబినెట్లో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఈ దేవాలయాన్ని, మఠాన్ని కూల్చకుండా కాపాడాలని కోరారు. లేనిపక్షంలో ఈ దేవాలయ పరిరక్షణ కోసం బీఆరఎస్ పార్టీ భక్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు.