లబ్ధిదారుల ఇళ్ల వద్దనే ఫించన్ల పంపిణీ
పాలకొల్లులో మంత్రి నిమ్మల పంపిణీ
అమరావతి, క్రైమ్ మిర్రర్: ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. మార్చి1 ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే అంటే శనివారం పింఛన్లను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కాగా ఉదయం 11 గంటలకే సుమారు 82 శాతం మేర పింఛన్లు అధికారులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం 62.76 లక్షల మంది లబ్దిదారులకు రూ. 2,725 కోట్లు విడుదల చేసింది. స్వర్ణవార్డు, స్వర్ణగ్రామ సిబ్బంది లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదుగా అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావివలస గ్రామంలో అక్కడ లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేపట్టారు.
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. వృద్ధురాలికి పింఛన్ అందజేసి ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
2029లో అధికారంలోకి వస్తే రాక్షసత్వం ప్రదర్శిస్తా మన్న వైసీపీ వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. మానవత్వంతో పనిచేసే కూటమి ప్రభుత్వమా లేక రాక్షసత్వం గల వైసీపీనా అని ప్రజలు తేడా బేరీజు వేసుకోవాలన్నారు.
జగన్ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా తప్పిదాలు చేస్తున్నారని తెలిపారు. పురాణకాలంలో యజ్ఞాలను అడ్డుకున్న రాక్షసుల్లా నేడు అభివృద్ధిని, మంచి కార్యక్రమాలను అడ్డుకునే దుష్టశక్తిగా వైసీపీ తయారైందంటూ మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు.
