వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ-2’ విడుదలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. సినిమా విడుదలపై విధించిన స్టేను కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. సినిమా విడుదలపై కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించింది. సినిమా కంటెంట్పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తూ తాత్కాలికంగా విడుదలను నిలిపివేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. కేసును విచారించిన డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
త్వరలో సినిమా రిలీజ్ డేట్ ప్రకటన
హైకోర్టు తాజా తీర్పుతో ‘ది కేరళ స్టోరీ 2’ విడుదలకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తీర్పు చిత్ర యూనిట్కు పెద్ద ఊరటనిచ్చినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. విపుల్ అమృత్ లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో అదితి భాటియా, ఐశ్వర్య ఓజా, తదితరులు నటించారు.
ఇంతకీ అసలు వివాదం ఏంటి?
‘ది కేరళ స్టోరీ’ మొదటి భాగం విడుదల సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. కథాంశం, నేపథ్యం కారణంగా అనేక వివాదాలు తలెత్తాయి. అదే నేపథ్యంతో రూపొందిన రెండో భాగం కూడా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. సినిమా కంటెంట్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ స్టే విధించగా, ఇప్పుడు డివిజన్ బెంచ్ ఆ స్టేను ఎత్తివేసింది. కేరళ హైకోర్టు తాజా నిర్ణయం చిత్ర నిర్మాతలకు, దర్శకులకు పెద్ద ఊరటగా మారింది. సినిమా విడుదలకు మార్గం సుగమం కావడంతో చిత్ర యూనిట్ విడుదల ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని ఈ చిత్ర నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
