Friday, February 27, 2026
Homeజాతీయంగ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. వీరికే సబ్సిడీ

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. వీరికే సబ్సిడీ

ప్రతీ ఆర్థిక సంవత్సరంలో గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన ఆధార్ ఆధారిత ఈకేవైసీ ప్రక్రియకు గడువు సమీపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో మార్చి 31లోపు దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులందరూ ఆధార్ ఈకేవైసీ పూర్తి చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే సబ్సిడీ నగదు జమలో అంతరాయం కలగవచ్చని హెచ్చరించింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా కూడా వివరాలను వెల్లడించింది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.

గ్యాస్ సిలిండర్ల వినియోగదారులు తమ ఆధార్ ప్రామాణీకరణను బయోమెట్రిక్ విధానంలో లేదా ఈకేవైసీ రూపంలో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కొత్తగా సౌకర్యవంతమైన విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఆధార్ ఫేస్‌ఆర్‌డి యాప్‌తో పాటు మీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్‌ని ఉపయోగించి ఇంటి వద్ద నుంచే ఉచితంగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకునే వీలుందని తెలిపింది. ఇందుకోసం https:// www.pmuy.gov.in/e-kyc.html లేదా మీ LPG డిస్ట్రిబ్యూటర్‌ను కూడా సంప్రదించవచ్చు.. లేదా టోల్-ఫ్రీ నంబర్‌ 1800 2333 555కు కాల్ చేయవచ్చు” అని కేంద్రం స్పష్టం చేసింది.

ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లపై 300 రూపాయల సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ నగదు జమ కావడం నిలిచిపోవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ఈకేవైసీ పూర్తి చేయకపోయినా 7వ రీఫిల్ వరకు సబ్సిడీ కొనసాగుతుందని, ఆ తరువాత కూడా నిర్లక్ష్యం చేస్తే నిధులు నిలిపివేయబడతాయని స్పష్టం చేశారు. ఒకసారి ఈకేవైసీ పూర్తి చేసిన తరువాత సబ్సిడీ మళ్లీ ఖాతాలో జమ అవుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈకేవైసీ పూర్తి చేసి ఉంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రతి వినియోగదారు తన ధృవీకరణను పూర్తి చేసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. ఉజ్వల లబ్ధిదారులతో పాటు సాధారణ గ్యాస్ వినియోగదారులందరూ ఈ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది.

ALSO READ: Chief Justice: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments