Honey Trap: అంగవైకల్యంతో బాధపడుతున్న ఒక యువకుడిని మాయమాటలతో వలలో వేసి అతనిపై దారుణ చర్యలకు పాల్పడిన ఘటన కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగర పరిధిలోని పనంపిల్లి నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. చెవిటి, మూగ స్వభావం కలిగిన యువకుడిని ముందుగా స్నేహం పేరుతో సంప్రదించి, నమ్మకం కలిగించి, అనంతరం ప్రణాళికాబద్ధంగా హనీ ట్రాప్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఉత్తర పరవూర్ ప్రాంతానికి చెందిన సప్నా అనే యువతి జాన్ రాహుల్, అమల్, ఆనంద్ అనే ముగ్గురితో కలిసి కొల్లం జిల్లా నిల్లిల్లాకు చెందిన అమల్ దేవ్ అనే యువకుడిని లక్ష్యంగా ఎంచుకున్నట్లు వెల్లడైంది. కొంతకాలంగా ప్రేమగా మాట్లాడి అనుబంధాన్ని పెంచుకున్న సప్నా, ఈనెల 25న పనంపిల్లి ప్రాంతంలోని ఒక లాడ్జికి రావాలని అతడిని ఒత్తిడి చేసింది.
బీచ్ వద్ద కలుద్దామని బాధితుడు చెప్పినప్పటికీ యువతి వినకుండా లాడ్జికే రావాలని పట్టుబట్టినట్లు సమాచారం. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో అమల్ దేవ్ అక్కడికి చేరుకోగా, ముందస్తు ప్రణాళిక ప్రకారం సప్నా మిత్రులు ముగ్గురు బాత్రూంలో దాక్కున్నారు. యువకుడు గదిలోకి వచ్చిన అనంతరం అతనిపై శృంగారానికి సపోర్ట్ చేయాలని ఒత్తిడి చేసింది. వివిధ భంగిమల్లో చిత్రాలు, దృశ్యాలు తీసి తరువాత డబ్బుల కోసం బెదిరించాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే యువకుడు దీనికి నిరాకరించడంతో బాత్రూంలో దాక్కున్న ముగ్గురు బయటకు వచ్చి అతడిపై దాడి చేసి చితకబాదినట్లు సమాచారం.
అనంతరం యువకుడిని బలవంతంగా నగ్నంగా నిలబెట్టి చిత్రాలు తీశారని, డబ్బులు పంపితేనే ఆ చిత్రాలను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫోన్ ద్వారా గూగుల్ పే పిన్ నంబర్ తీసుకుని డబ్బులు బదిలీ చేయాలని ప్రయత్నించినప్పటికీ ఖాతాలో తక్కువ మొత్తం ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తీవ్ర భయాందోళనకు గురైన అమల్ దేవ్ వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. లాడ్జిలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు యువతితో పాటు మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అంగవైకల్యంతో ఉన్న వ్యక్తిని లక్ష్యంగా ఎంచుకుని మోసపూరితంగా వలవేసిన ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, నిందితురాలు పోలీసుల విచారణ సమయంలో నవ్వుతూ ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం కావడం మరింత చర్చనీయాంశమైంది. బాధితుడికి న్యాయం చేయాలని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: Khachandra Singh: భారత క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి మృతి
