Telangana: రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలుగు భాషా సాహిత్య పరిరక్షణకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచీకరణ ప్రభావంతో మాతృభాష ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో, విద్యా వ్యవస్థలో తెలుగుకు సముచిత స్థానం కల్పించాలని సంకల్పించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థల్లో 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి అంశంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే పూర్తిస్థాయిలో అమలవుతున్న ఈ విధానాన్ని ఇకపై ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలకూ విస్తరించనుంది. రాష్ట్ర పాఠ్య ప్రణాళికతో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ పాఠ్య విధానాలకు అనుబంధంగా ఉన్న అన్ని విద్యాసంస్థల్లో కూడా 2026-27 విద్యా సంవత్సరం నుంచి తెలుగును తప్పనిసరిగా బోధించాల్సి ఉంటుంది.
ఇటీవలి కాలంలో అనేక ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో తెలుగు భాషను పక్కన పెట్టి ఇతర భాషలకు ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా భాషా ఎంపికలో అధిక మార్కులు సాధించేందుకు అనుకూలంగా ఉండే ఇతర భాషలను విద్యార్థులకు బోధిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఫలితంగా అనేక మంది విద్యార్థులు తెలుగును చదవడం, రాయడం మాత్రమే కాకుండా సులభమైన వాక్యాలు కూడా అర్థం చేసుకోలేని స్థితికి చేరుకున్నారని ఆందోళన వ్యక్తమైంది. పదో తరగతి పూర్తిచేసిన కొంతమంది విద్యార్థులు కనీస స్థాయి తెలుగు పఠన సామర్థ్యాన్ని కూడా కలిగి లేకపోవడం భాషా పరిరక్షణకు పెద్ద సవాలుగా మారింది. ఈ పరిస్థితిని సరిచేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు తప్పనిసరి అమలు చట్టం-2018 ప్రకారం ప్రభుత్వం ఇప్పటికే దశలవారీగా అమలు ప్రారంభించింది. 2018-19 విద్యా సంవత్సరంలో 1 మరియు 6 వ తరగతుల్లో ప్రారంభించిన అమలు, 2022-23 నాటికి 1 నుంచి 10 వ తరగతుల వరకు విస్తరించాలనే లక్ష్యంతో కొనసాగింది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా పాఠశాలల నిర్వహణలో అంతరాయం ఏర్పడటంతో 9 మరియు 10 వ తరగతులకు తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. తాజా నిర్ణయం ప్రకారం 2025-26లో 9 వ తరగతి, 2026-27లో 10 వ తరగతి విద్యార్థులకు అమలులో కొంత సడలింపు కల్పించినప్పటికీ, 2026-27 విద్యా సంవత్సరం నుంచి మాత్రం రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో 1 నుంచి 10 వ తరగతి వరకు తెలుగును కచ్చితంగా బోధించాల్సి ఉంటుంది.
ఇతర పాఠ్య విధానాలకు అనుబంధంగా ఉన్న పాఠశాలల కోసం ప్రభుత్వం సరళమైన పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టింది. కఠినమైన పాఠ్యాంశాల బదులుగా సులభంగా అర్థమయ్యే విధంగా రూపొందించిన కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి 8 వ తరగతి లేదా అంతకంటే పై తరగతుల్లో చేరే విద్యార్థులకు మాత్రమే పరిమిత మినహాయింపు ఉంటుంది. తెలుగును అమలు చేయని పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని విద్యాసంస్థలు తగినంత మంది తెలుగు ఉపాధ్యాయులను నియమించుకోవాలని, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి రూపొందించిన పాఠ్య పుస్తకాలను తప్పనిసరిగా ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా భవిష్యత్ తరాలకు మాతృభాషపై పట్టు పెంపొందించి, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలనే ప్రభుత్వ సంకల్పం స్పష్టమవుతోంది.
ALSO READ: Telangana: భారీగా IAS అధికారుల బదిలీలు

