మఱ్ఱిగూడ,క్రైమ్ మిర్రర్:- స్నేహం అంటే కేవలం కలిసి ఆడుకోవడం, చదువుకోవడం మాత్రమే కాదు.. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలబడటమని, ఇందుర్తి గ్రామానికి చెందిన విద్యార్థులు నిరూపించారు. ఇటీవల ఇందుర్తి గ్రామానికి చెందిన నామ రమేష్ అకాల మరణం చెందడంతో, ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తన చిన్ననాటి మిత్రుడి మరణవార్త విని చలించిపోయిన, ఏరుకొండ అబ్బయ్య, ఎలాగైనా రమేష్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తన తోటి క్లాస్మేట్స్ అందరికీ, ఫోన్ చేసి విషయం వివరించారు.
మిత్రబృందం అబ్బయ్య పిలుపునకు స్నేహితులందరూ సానుకూలంగా స్పందించారు. ఒకరినొకరు సంప్రదించుకుని తమ వంతు సహాయంగా, 42వేల రూపాయల నగదును సేకరించారు. ఈ మొత్తాన్ని బుధవారం, మరణించిన రమేష్ కుటుంబ సభ్యులకు నగదు అందజేసి వారికి ధైర్యం చెప్పారు. స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన ఈ మిత్రబృందాన్ని గ్రామస్తులు అభినందించారు. ఆపదలో ఉన్నప్పుడు తోటి స్నేహితులు చూపిన ఈ చొరవ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఏరుకొండ అబ్బయ్యతో పాటు, ఎస్. జంగయ్య, యజ్ఞచారి, జి. రాజు, పి. రఘు, వినోద, ఉషారాణి, రమ్య, రజిని, రమేష్, వి. శ్రీశైలం, పాపచారి, యాదమ్మ, బి.సైదులు, ఎల్. ప్రభాకర్ చారి, నర్సింహా, సబిత, కె. కృష్ణ, సిహెచ్ అరుణ, నిర్మల, ఎల్. విజయ్ కుమార్ ముందుకు వచ్చి సహాయం అందించారు.

