Justice After Three Decades: 20 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణతో ఓ మాజీ కానిస్టేబుల్ 30 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. చివరకు కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కానీ, తీర్పు వెలువడిన మరుసటి రోజే ఆయన మరణించారు. ఈ విషాదకర ఘటన గుజరాత్లో జరిగింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
1996లో అహ్మదాబాద్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బాబుభాయ్ ప్రజాపతిపై రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో కేసు నమోదైంది. 2004లో సెషన్స్ కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ బాబుభాయ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి సుమారు 22 ఏళ్ల పాటు ఆ అప్పీల్ కోర్టులో పెండింగ్లోనే ఉంది.
ఈ నెల 4న నిర్దోషిగా తేల్చిన న్యాయస్థానం
జనవరి 4, 2026న న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ఆయనను నిర్దోషిగా తేల్చింది. ఆ రోజు అతడు లంచం తీసుకున్నాడని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని ప్రకటించింది. కోర్టు తీర్పుపై బాబు భాయ్ ప్రజాపతి సంతోషం వ్యక్తం చేశారు. ‘‘నా జీవితంపై ఉన్న మచ్చ తొలగిపోయింది. ఇప్పుడు దేవుడు నన్ను తీసుకెళ్లినా నాకు ఎలాంటి బాధ లేదు. ప్రశాంతంగా కన్నుమూస్తా’’ అన్నారు.
ఆయన అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి. తీర్పు వచ్చిన మరుసటి రోజే బాబుభాయ్ గుండెపోటుతో మరణించారు. జీవితం మీద పడిన మచ్చ తొలిగిపోవడంతో పాటు ఆయన, ఈ భూమ్మీది నుంచే వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన గుజరాత్ లో అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
