క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత నెలలోనే మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంటు ముంగిటకు వచ్చింది. అయితే మూడింట రెండో వంతు మద్దతు లేకపోవడంతో మహిళ రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. దీంతో పునర్విభజన బిల్లును కూడా వెనక్కి తీసుకుంది కేంద్రం. అయితే మరోసారి దేశవ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పునర్విభజన బిల్లు పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అయితే ఇంతకుముందు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనపై అధ్యయనం చేసింది. అందుకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను బయటపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. పునర్విభజనతో 824 నియోజకవర్గాలకు పెంచాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 543 నియోజకవర్గాల్లోని 59 స్థానాలను రెండుగా, 11 స్థానాలను మూడు నియోజకవర్గాలుగా విభజించాలని ప్రతిపాదించింది గత ఎన్నికల్లో పోలింగ్ శాతంతో పాటుగా పట్టణ, ఎస్సీ ఎస్టీ మహిళల జనాభా సహా పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచనలు చేసింది.
ఇలా చేస్తారు..
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ ఆర్థిక సలహా మండలి కీలక సూచనలు చేసింది. ఏపీలోని విశాఖ, రాజంపేట, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల నియోజకవర్గాలను మూడు నియోజకవర్గాల చొప్పున.. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు నియోజకవర్గాల చొప్పున విడదీయాలని సూచించింది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ నియోజకవర్గాలను మూడుగా… చేవెళ్ల నియోజకవర్గం వర్గాన్ని రెండుగా విభజించాలని సిఫార్సు చేసింది. తాజా సిఫారసుల ప్రకారం నియోజకవర్గాలను విభజిస్తే ఏపీలో 3.52 శాతం, తెలంగాణలో 6.55% ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉర్దూ మాట్లాడేవారు అధికంగా ఉన్నారు. అందుకే ఇక్కడ మూడు నియోజకవర్గాల చొప్పున పెంచాలని సూచించింది ఆర్థిక మండలి.
మరోసారి బిల్లు..
మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంటు ముంగిటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బెంగాల్లో 20 మంది టీఎంసీ లోక్సభ సభ్యులు ప్రత్యేక శిబిరంగా ఏర్పడ్డారు. ఎన్డీఏ కు మద్దతు తెలిపారు. ఇంకో వైపు తమిళనాడులో సైతం స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు తెలిపే అవకాశం ఉంది. ప్రతి రాష్ట్రం నుంచి ఇప్పుడున్న నియోజకవర్గం 50 శాతం పెరిగే ఛాన్స్ ఉంది. ఈ విషయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగే పరిస్థితి ఉండదని కేంద్రం వాదిస్తోంది. ఇప్పుడు ప్రధాని ఆర్థిక సలహా మండలి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో పునర్విభజన బిల్లు మరోసారి పార్లమెంట్ ముంగిటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.