-
ఏపీ కాంగ్రెస్ పగ్గాల నుంచి ఔట్
-
హై కమాండ్ కు ఫిర్యాదులు
-
తెరపైకి సుంకర పద్మశ్రీ పేరు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో రాజకీయ కీలక పరిణామం. కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల మార్పు తధ్యం అన్న ప్రచారం నడుస్తోంది. ఆమె స్థానంలో కొత్త వారి ఎంపిక ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా సుంకర పద్మశ్రీ పేరు వినిపిస్తోంది. షర్మిల నియామకం జరిగి మూడేళ్లు అవుతున్న తరుణంలో ఆమెను మార్చేస్తారని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు నుంచి వెళ్లిన ఫిర్యాదులు నేపథ్యంలో ఆమెను తప్పిస్తారన్న టాక్ నడుస్తోంది. 2024 ఎన్నికలకు ఏడాది ముందు షర్మిల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అయితే గత మూడేళ్లలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా బలోపేతం అయింది లేదు. పార్టీ హైకమాండ్ ఊహించినంతగా మార్పులు లేవు. అందుకే షర్మిలను మార్చుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తోంది.
తెలంగాణ నుంచి ఏపీకి..
తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీని స్థాపించారు షర్మిల. తెలంగాణలో పాదయాత్ర కూడా చేశారు. కానీ తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించలేదు. దీంతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు షర్మిల. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చూశారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందని భావించారు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం ఏపీ పగ్గాలు అందించేందుకు నిర్ణయించింది. అలా ఏపీ బాధ్యతలను తీసుకున్నారు షర్మిల. కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా షర్మిల అధ్యక్షురాలు అయిన తర్వాత కలిసి రాలేదు ఆ పార్టీకి. కానీ షర్మిల అనుకున్న మాదిరిగా తన సోదరుడు జగన్మోహన్ రెడ్డికి భారీ డ్యామేజ్ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయ గలిగారు.
సీనియర్లపై వివక్ష…
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సీనియర్లను కలుపుకొని వెళ్లడం లేదన్న విమర్శ షర్మిలపై ఉంది. వాస్తవానికి 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుతో కాంగ్రెస్కు చాలా నష్టం జరిగింది. దాని నుంచి అధిగమించి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతను షర్మిలకు అప్పగించింది కాంగ్రెస్ హై కమాండ్. అయితే షర్మిల అధ్యక్షురాలు అయ్యాక చాలామంది సీనియర్లు పార్టీ నుంచి బయటకు. ఉన్నవారు సైతం ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది సీనియర్లు షర్మిల నాయకత్వాన్ని మార్చాలని హై కమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. దీనిపై అధిష్టానం సైతం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రముఖంగా సుంకర పద్మశ్రీ పేరు…
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయంతో ఆ పార్టీకి చాలామంది నేతలు దూరమయ్యారు. అటువంటి సమయంలో మహిళా నేతగా ఉన్న సుంకర పద్మశ్రీ చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఆమెకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం నడిచింది. ఇంతలోనే అనూహ్యంగా షర్మిల తెలంగాణ రాజకీయాలనుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అలా సుంకర పద్మశ్రీ కి రావాల్సిన ఛాన్స్ ను షర్మిల కొట్టేశారు. అప్పటినుంచి సుంకర పద్మశ్రీ షర్మిలపై అసంతృప్తి గానే ఉన్నారు. ఆమె సైతం ఎప్పటికప్పుడు షర్మిల తీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఈసారి షర్మిల మార్పు ఖాయమని.. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతానని సుంకర పద్మశ్రీ బాహాటంగానే చెబుతున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.