Weather Alert: నైరుతి రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం జూన్ 4న కేరళలోకి నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించాయి. అలాగే తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో వర్షాకాలానికి అధికారికంగా శ్రీకారం చుట్టినట్లయింది.
రుతుపవనాల ప్రభావంతో రాబోయే రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక తీర ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, అలాగే ఉత్తర, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా వాతావరణ మార్పులు స్పష్టంగా కనిపించనున్నాయని అంచనా వేసింది.
కేరళలో వచ్చే 5 నుంచి 7 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయగా, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, స్థానికంగా వరద పరిస్థితులు ఏర్పడే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని పేర్కొన్నారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా మండుతున్న ఎండల తీవ్రత కొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మేఘావృత వాతావరణం, తేలికపాటి వర్షాలు, ఉరుములు, ఈదురుగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.
కొత్తగా ఏర్పడిన పశ్చిమ అవాంతరాల ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఉత్తర భారత కొండ ప్రాంతాల్లో కూడా వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. పర్యాటకులు, యాత్రికులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అయితే బీహార్లో మాత్రం ఇంకా వేడి తీవ్రత కొనసాగనున్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసి ఉష్ణోగ్రతలను కొంత మేర తగ్గించే అవకాశముందని వెల్లడించింది.
ALSO READ: కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభుల అవతారం