ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్పై చేసిన యుద్దంలో టెహ్రాన్ తీవ్రంగా నష్టపోయింది. యుద్దం నష్టం విలువ 25లక్షల కోట్లకు పైనే అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. తాజాగా తమపై దాడులు చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్కు సహకరించిన ఐదు అరబ్ దేశాలు సైతం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఇరాన్ రాయబారి, శాశ్వత ప్రతినిధి అమీర్-సయీద్ ఇరావానీ తాజాగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భద్రతా మండలి అధ్యక్షుడు జమాల్ ఫరేస్ అల్-రోవాయిలకు లేఖలు రాశారు.
అమెరికా-ఇజ్రాయెల్కు సహకరించిన బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, జోర్డాన్ల నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాలని ఐక్యరాజ్యసమితికి సయీద్ ఇరావానీ విజ్ఞప్తి చేశారు. కొన్ని గల్ఫ్ దేశాలు అమెరికాకు సహాయం చేశాయని, తమ భూభాగం, గగనతలం ఉపయోగించుకునే అవకాశం ఇచ్చినట్లు ఇరాన్ ఆరోపించింది. ఆ అరబ్ దేశాల వల్లే ఇరాన్పై దాడులు జరగడానికి వీలైందని, ఈ కారణంగా ఆ దేశాలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ అభిప్రాయపడింది.
