హైదరాబాద్, క్రైమ్మిర్రర్: రాష్ర్టంలో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుంది. తాజాగా తెలంగాణ సర్కార్ మహిళలకు ఒక శభవార్త చెప్పింది. గ్రామీణ మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యంగా పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ పథకం ద్వారా మహిళలకు పశుసంపద పెంపకంలో శిక్షణ ఇవ్వడంతో పాటు, ఆర్థిక తోడ్పాటును కూడా అందించనుంది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది.తాజాగా గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు గొర్రెలు, మేకలు, నాటుకోళ్లును సబ్సిడీ కింద అందించనుంది. జూన్ 2 నుంచి ఈ కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మార్గదర్శకత్వంలో రూపొందిన ఈ ప్రాజెక్టు గ్రామీణ మహిళలు సొంతంగా ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహిస్తుంది.
ఈ పథకాన్ని కేవలం సంప్రదాయ గొర్రెల పెంపకానికే పరిమితం చేయకుండా ఆధునిక పద్ధతుల్లో మహిళా సంఘాల సభ్యులకు లాభాలను ఆర్జించే విభిన్న యూనిట్లను కూడా అందించనున్నారు. వాటిలో పొట్టేళ్ల పెంపకం, గొర్రెలు, మేకల యూనిట్లు , నాటుకోళ్ల పెంపకం, ప్రత్యేకంగా ఈము పక్షుల యూనిట్లను ఇవ్వనున్నారు. అలాగే వాటి పెంపంకం కోసం సబ్సిడీ కింద ఆర్థిక సాహాయం కూడా అందించనున్నారు. అయితే ఈ యూనిట్ల నిర్వహణలో లబ్ధిదారులకు మెరుగైన అవగాహన కల్పించేందుకు పి.వి. నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. ఈ శిక్షణలో పశువుల ఆరోగ్యం, సరైన మేత నిర్వహణ, వ్యాధి నిరోధక చర్యల గురించి నిపుణులు అవగాహన కల్పిస్తారు.
అయితే ఈ పథకం కింద ఎంపికైన మహిళా సభ్యురాళ్లకు బ్యాంకులతో అనుసంధానం చేసి తక్కువ వడ్డీకే రుణాలు, రివాల్వింగ్ ఫండ్స్, ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీల అందజేస్తారు. ఈ మేరకు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పశువైద్య వర్సిటీ రిజిస్ట్రార్ శరత్చంద్ర ఈ అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశారు. శిక్షణ పొందిన మహిళలు నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా మంచి లాభాలు పొందుతారని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.