-
అక్రమ కోళ్ల ఫారాలకు ఎస్సై వత్తాసు…!
-
బాధితులపైనే అక్రమ కేసులా?
-
మర్రిగూడ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి గ్రామస్తుల ఫిర్యాదు.
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): మర్రిగూడ మండల పరిధిలోని, దామెరభీమనపల్లిలో ఏర్పాటు చేసిన, విలేకరుల సమావేశంలో మాజీ ఎంపిటిసి సిలివేరు విష్ణు మాట్లాడుతూ.. దామెర భీమనపల్లి గ్రామ శివారులోని, సర్వే నెంబర్ 581లో ప్రభుత్వపరంగా ఎటువంటి అనుమతులు లేకుండా, అక్రమంగా కోళ్ళ ఫారాల నిర్మాణం చేపట్టడం వల్ల, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిర్మాణాల వల్ల వెలువడే భరించలేని దుర్వాసన, ఈగలు, దోమల బెడదతో గ్రామస్తుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని, దీనిపై తాము ప్రజాస్వామ్యబద్ధంగా, ఆందోళనలు చేస్తున్నామని వివరించారు. ఈ అక్రమ నిర్మాణాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు కూడా వీటికి ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేసినప్పటికీ, మర్రిగూడ ఎస్సై మునుగాల కృష్ణారెడ్డి మాత్రం, యజమానికి కొమ్ముకాస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

కోళ్ళ ఫారాల యజమాని ఇచ్చిన తప్పుడు పిటిషన్లపై, ఎటువంటి ప్రాథమిక విచారణ జరపకుండానే, కేవలం తమ హక్కుల కోసం పోరాడుతున్న గ్రామస్తులపై ఎస్సై అక్రమ కేసులు, నమోదు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇది చాలదన్నట్లు, గ్రామంలోని పలు సివిల్ వివాదాల్లో కూడా ఎస్సై అనవసరంగా, జోక్యం చేసుకుంటూ పేద ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు.
ఒక రక్షక భటుడిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఎస్సై, అక్రమదారులకు వత్తాసు పలుకుతూ, సామాన్యులను ఇబ్బంది పెట్టడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్కు విన్నవించామని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఎస్సై కృష్ణారెడ్డిని వెంటనే విధుల నుండి తొలగించి, సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని అన్నారు. గ్రామస్తులపై, బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేసే వరకు తమ పోరాటం ఆపబోమని గ్రామస్తులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దామెర భీమనపల్లి గ్రామ ప్రజలు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.