Crime Mirror,Latest Updates: దేశంలో సంచలనం సృష్టించిన పూణేకు చెందిన వ్యాపారవేత్త హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ ను కాబోయే భార్య కొండపై నుంచి తోసేసిందని ఇప్పటివరకు ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవంటూ పోలీసులు కోర్టుకు వెళ్లడం సంచాలను సృష్టిస్తోంది.
లోహగడ్ కోటపై నుంచి కేతన్ అగర్వాల్ ను ఎవరు నెట్టేశారో అనేదానిపై స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలుగా ఉన్న సియా గోయల్ కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని తాజాగా పోలీసులు కోరారు.
ఈ క్రమంలోనే ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన సమాచారాన్ని కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికలోనే ఈ విషయాన్ని వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే సియా, ఆమె ప్రియుడు చేతన్ వాంగ్మూలాలను నమోదు చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఈ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లాలంటే పాలిగ్రాఫ్ పరీక్ష అవసరమని కోర్టుకు పోలీసులు తెలియజేశారు.
దర్యాప్తుకు తాజా ఆధారాలను అందించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని పోలీసులు వివరించారు. ఏదైనా కేసులో ప్రాథమిక ఆధారాలు బలహీనంగా ఉన్న సమయంలో దర్యాప్తు బృందాలు పాలిగ్రాఫ్ పరీక్షలకు అనుమతి కోరడం సాధారణం. ఈ కేసులను అటువంటి పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు పాలిగ్రాఫ్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.
ఇకపోతే ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే సియా, చేతన్ ను లోహగడ్ కోట వద్దకు తీసుకెళ్లి సీన్ రిక్రియేషన్ చేశారు. తాజాగా సహనిందితుడు చేతన్ నడకను విశ్లేషించేందుకు గెయిట్ అనాలసిస్ కూడా పోలీసులు చేస్తున్నారు.
-
హత్యకు ముందు రిహార్సల్స్ చేసిన నిందితులు..
కేతన్ అగర్వాల్ ను హత్య చేయడానికి ముందు నిందితులు ఇద్దరు ఘటన జరిగిన చోట రిహార్సల్స్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎలా కోటపై నుంచి తోసేయాలి అన్న దానిపై ఇద్దరూ నిందితులు ముందుగానే అక్కడికి వెళ్లి ప్రణాళిక వేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. తాజాగా పోలీసులు నిందితులు ఇద్దరిని రిహార్సల్స్ చేసిన ప్రాంతానికి పోలీసులు తీసుకువెళ్లి మరిన్ని వివరాలను సేకరించారు.
ఇకపోతే ఈ కేసులో షియాకు సంబంధించిన మరిన్ని విషయాలను కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. షియా పెళ్లికి ముందే ఇష్టం లేకుండా ఉండేదని, చేతన్ తో ఫోన్ మాట్లాడుతూ బిజీ గా ఉండేదని పోలీసులకు కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. చేతన్ పేరును ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉండేదని వెల్లడించినట్లు తెలుస్తోంది.
వీరిద్దరి బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణం తోనే తమ కుమారుడిని హత్య చేసిందని కేతన్ అగర్వాల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇకపోతే పోలీసులకు తాజాగా మరికొన్ని ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. నిందితులు ఇద్దరు గతంలో క్రికెట్ మ్యాచ్కు హాజరైన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
సియా సోదరి ద్వారానే ఆ ఇద్దరికి పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇకపోతే ఈ కేసులో సియా విచారణకు సంబంధించి కోర్టు ఎటువంటి ఆదేశాలను ఇస్తుందో అన్నది ప్రాధాన్యతను సంతరించుకుంది.