క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ (54) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శంకర్ గౌడ్ కన్నుమూశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
శంకర్ గౌడ్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎవరూ కూడా తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించి తగిన పరిష్కారాలు చూపాలని మంత్రుల కమిటీని ముఖ్యమంత్రి ఆదేశించారు. శంకర్ గౌడ్ మృతితో నర్సంపేట మరియు పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన అంత్యక్రియలు సొంత గ్రామంలో నిర్వహించబడ్డాయి.