క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయంలోకి సందర్శకులు ప్రవేశించాలంటే క్యూఆర్ (QR) కోడ్ ఉండటం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. అపరిచితుల చొరబాటును అరికట్టి, పరిపాలనా కేంద్రంలో పూర్తిస్థాయి పర్యవేక్షణ తీసుకురావడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. సచివాలయానికి వచ్చే సందర్శకులు ముందుగా సంబంధిత అధికారులు లేదా మంత్రుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వారు అనుమతి మంజూరు చేయగానే, సందర్శకుల మొబైల్ ఫోన్కు ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ వస్తుంది. సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన స్కానర్ల వద్ద ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన తర్వాత మాత్రమే సందర్శకులకు లోపలికి ప్రవేశం లభిస్తుంది. ఈ కొత్త విధానంలో కేవలం ప్రవేశం మాత్రమే కాదు, సందర్శకులు లోపల గడిపే సమయాన్ని కూడా నియంత్రించనున్నారు.
తెలంగాణ, ఏపీల్లో దంచికొడుతున్న వర్షాలు: పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు
ఒక గంట మాత్రమే అనుమతి:- లోపలికి వెళ్లిన సందర్శకులు సచివాలయంలో కేవలం ఒక గంట మాత్రమే ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ సందర్శకులు గంటకు మించి లోపల ఉంటే, వెంటనే భద్రతా సిబ్బందికి అలర్ట్ వెళ్తుంది. సందర్శకులు ఏ అధికారి లేదా మంత్రి పేషీకి వెళ్లారు? సచివాలయంలో ఎంతసేపు ఉన్నారు? అనే పూర్తి వివరాలు సిస్టమ్లో రికార్డ్ అవుతాయి. సచివాలయంలోకి ఎవరంటే వారు, సరైన కారణం లేకుండా ప్రవేశిస్తుండటం, అపరిచితుల రాకపోకలు పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత ఎంట్రీ సిస్టమ్ ద్వారా భద్రత మరింత పటిష్టం కావడంతో పాటు, సచివాలయంలోకి అనవసరమైన వారి ప్రవేశాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. మాజీ డీజీపీలకు సెక్యూరిటీ తగ్గింపు, బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు తొలగింపు!!